మంత్రిగారికి షాకులిచ్చిన శ్రుతి హాసన్



హీరోయిన్ శ్రుతిహాసన్ సినిమావాళ్ళకి భారీ స్థాయిలో షాకులిస్తోంది. ఆమె షాకుల ధాటికి సినిమావాళ్ళు విలవిలలాడిపోతున్నారు. మొన్నీమధ్య నాగార్జున సినిమాకి డేట్స్ ఇచ్చి, ఎంచక్కా లక్షలకు లక్షలు డబ్బు తీసుకుని, సగం షూటింగ్ అయిపోయిన తర్వాత నేను షూటింగ్ రాను పొమ్మంటూ ఒక ఎస్సెమ్మెస్ పెట్టి ఊరుకుంది. దాంతో సదరు సినిమా నిర్మాత నెత్తీనోరూ బాదుకుంటూ కోర్టు మెట్లెక్కాడు. కోర్టు ఈ తలబిరుసు హీరోయిన్‌కి మొట్టికాయలు వేసి, తాను మళ్ళీ ఆదేశాలు ఇచ్చేవరకూ కొత్త సినిమాలు ఒప్పుకోవద్దని ఆర్డర్ వేసింది. శ్రుతి హాసన్ సినిమావాళ్ళకి ఇచ్చే షాకుల విషయం ఇలా వుంటే, రెండ్రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ మంత్రిగారికి ఈ ముద్దుగుమ్మ భారీ షాక్ ఇచ్చింది. ఈమె ఇచ్చిన షాక్ ధాటికి ఆ మంత్రిగారు  కంగారుపడిపోయారు. ఇంతకీ అసలేం జరిగిందంటే....

ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మంత్రిగారు హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళడానికి విమానం ఎక్కారు. విమానం టేకాఫ్ అవడానికి ఇంకా కొంత సమయం వుంది. విమానంలో కూర్చున్న మంత్రిగారు చాలా ఇంపార్టెంట్ విషయాన్ని ఫోన్లో మాట్లాడుతూ వున్నారు. ఇంతలో ముందు వరసలో కూర్చుని వున్న శ్రుతి హాసన్ తోకతొక్కిన తాచులాగా లేచి నిల్చుని ‘‘మీరు ఫోన్ మాట్లాడుతుంటే నేను డిస్ట్రబ్ అయిపోతున్నాను’’ అని గోలగోలగా అరిచింది. విమానంలో ఫోన్లు మాట్లాడకూడదంటూ లా పాయింట్ బయటకి లాగింది. మంత్రిగారు పాపం ఎవరో ఆడకూతురు ఇబ్బంది పడిపోతుందని అనుకుని.. ‘‘అది కాదమ్మా.. ఇంపార్టెంట్ ఫోను...’’ అని చెప్తున్నా శ్రుతిహాసన్ ఎంతమాత్రం వినిపించుకోకుండా తన గోల శ్రుతి పెంచింది. ఎయిర్‌హోస్టెస్‌ని పిలిచి కంప్లయింట్ చేసింది. దాంతో మంత్రిగారు ఆడకూతురితో ఎందుకొచ్చిన గొడవ అనుకుని ఫోన్ కట్ చేసి కూర్చున్నారు. శ్రుతి హాసన్ ధాటికి అప్పటికే విమానంలోని ప్రయాణికులందరూ ఆమెని వింతగా, మంత్రిగారిని జాలిగా చూస్తున్నారు.

ఫ్లైట్ కాసేపట్లో గాల్లోకి ఎగరబోతుందనగా, మంత్రిగారికి మరో ఫోన్ వచ్చింది. ఆయన పీఏకి యాక్సిడెంట్ అయిందంటూ ఫోనొచ్చింది. ఫోన్లో ఆ విషయం తెలుసుకున్న మంత్రిగారు కాస్త ఆందోళనతో ఫోన్ మాట్లాడుతూ వుండటంతో, మన తోకతొక్కిన తాచు, తోకలేని కోతి శ్రుతిహాసన్ మరోసారి రయ్యిమంటూ లేచి నిల్చుని పెద్దపెద్దగా అరవడం ప్రారంభించింది.  కాసేపు అరిచీ అరిచీ ఆ తర్వాత ఏడవటం మొదలుపెట్టింది. దాంతో మంత్రిగారు గతుక్కుమన్నారు. విమానంలోని కొంతమంది అయితే శ్రుతిహాసన్ ఏడుపు సీను చూసి మంత్రిగారిని అనుమానంగా కూడా చూశారు. ఈలోగా ఎయిర్ హోస్టెస్ వచ్చి శ్రుతిహాసన్ని సముదాయించి కూర్చోబెట్టింది. మంత్రిగారు ఎందుకొచ్చిన గొడవ అనుకుని తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సైలెంట్‌గా కూర్చుండిపోయారు. ఫ్లయిట్ టేకాఫ్ అయి, తిరుపతిలో లాండ్ అయ్యేవరకూ ఆయన కిక్కురుమనకుండా కూర్చుండిపోయారు. శ్రుతిహాసనా మజాకానా!