పాడి కౌశిక్ రెడ్డి కి షాక్.. మునిసిపాలిటీ కాంగ్రెస్ కైవసం!
posted on: Feb 13, 2026 3:51PM

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పురపోరులో గట్టి షాక్ తగిలింది. హుజూరాబాద్ మునిసిపాలిటీని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లో చాలా క్రీయిశీలంగా వ్యవహరిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పై విమర్శలతో, దూషణలతో విరుచుకు పడు తున్నారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ మునిసిపాలిటీ ఫలితం బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటుందని అంతా భావించారు.
తీరా ఫలితాలు వెల్లడయ్యేసరికి హూజూరాబాద్ మునిసిపాలిటీని కాంగ్రెస్ ‘హస్త’గతమైంది. హుజూరాబాద్ మునిసిపాలిటిలో 16 వార్డులను కాంగ్రెస్ గెలుచుకుంది. బీఆర్ఎస్ కేవలం ఎనిమిది స్థానాలకు మాత్రమే పరిమితమై కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికలలో సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పాడి కౌశిక్ రెడ్డి వ్యూహాలు మున్సిపల్ ఎన్నికల్లో బెడిసికొట్టాయి.
పట్టణ ఓటర్లు అభివృద్ధిని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులనే ప్రామాణికంగా కాంగ్రెస్ కు ఓటెత్తారు. ఇక మునిసిపోల్స్ ప్రకటన వెలువడిన క్షణం నుంచీ కౌశిక్ రెడ్డి చేసిన ప్రకటనలు, వ్యక్తం చేసిన గెలుపు ధీమా కేవలం ఆర్భాటం మాత్రమేనని ఫలితాలు తేటతెల్లం చేశాయి. ఇక హుజూరాబాద్ లో బీజేపీ ఓ ఐదు వార్డులలో విజయం సాధించింది. ఒకప్పుడు ఈటల రాజేందర్ కంచుకోట అయిన హుజూరాబాద్లో బిజెపి మూడో స్థానానికి పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ మున్సిపాలిటీపై జెండా ఎగురవేసింది.






