శంకర్రావు కామెంట్‌కి సెల్యూట్...

 

తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి శంకర్రావు ఎప్పుడూ విచిత్రమైన కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తూ వుంటారు. కానీ తాజాగా ఆయన సెల్యూట్ చేయాల్సినంత స్థాయిలో ఒక మాట అన్నారు. దీని నేపథ్యం ఏమిటంటే, కొంతమంది తెలంగాణ నాయకులకు ట్యాంక్‌బండ్ మీద విగ్రహాలను చూస్తే కడుపులో మండుతూ వుంటుంది. తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి కూడా ఈ బాపతుకు చెందిన వ్యక్తే. ఆయన ఆదివారం నాడు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, ట్యాంక్ బండ్ మీద వున్న ఆంధ్రుల విగ్రహాలను తొలగించి వాటి స్థానంలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలను ప్రతిష్టిస్తామని ప్రకటించారు. దీని మీద శంకర్రావు స్పందించారు. ‘‘ట్యాంక్ బండ్ మీద వున్న విగ్రహాలు ఆంధ్రులవి కావు.. తెలుగువారివి. అధికారంలో వున్నవారు ప్రజల మధ్య విద్వేషాలను పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. తెలుగువారి గౌరవానికి నిదర్శనంగా మహనీయుల విగ్రహాలను ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. వాటిని తొలగిస్తామనడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అన్నారు.