జీతాల్లేకుండా ఎలా బతుకుతారు?: హరికృష్ణ
posted on Sep 3, 2013 11:39AM
రాష్ట్ర విభనను నిరసిస్తూ సీమాంధ్రలో గత 20 రోజులుగా సమైక్యాంధ్రకు మద్దతుగా సమ్మె చేస్తున్న ఉద్యోగులు అందరికీ వెంటనే జీతాలు చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుని బతికే సాధారణ ఉద్యోగులు నెల జీతాలు లేకుండా ఎలా బతుకుతారని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ ప్రశ్నించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా తన రాజ్యసభ సభ్యత్వానికి హరికృష్ణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వీలయినంత తొందరలో ఉద్యోగులకు జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సమ్మె చేస్తున్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వ తీరును ఆయన ఖండించారు. ఈ నెల 7న ఉద్యోగులు హైదరాబాద్ లో తలపెట్టిన బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.