మన అమరావతిని చూసి పాక్ ఎందుకు భయపడుతోంది?

posted on: Feb 10, 2017 11:06AM

 

నవ్యాంధ్ర రాజధాని అమరావతి. సూటిగా మాట్లాడుకుంటే ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణమే ప్రారంభం కాలేదు! ఎప్పుడు పూర్తవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి! కాని, అసలు ఇంకా అందుబాటులోకే రాని అమరావతి అంటే పాకిస్తాన్ ఎందుకు ఆమడ దూరం పరిగెడుతోంది? వింతగా వున్నా ఇది భారతీయులందరూ తెలుసుకోవాల్సిన విచిత్ర విషయం!

 

ఇండియా మీద ఏదో ఒక ఆరోపణ చేయటం దాయాది దేశానికి అలవాటే కదా... అలాగే, ఆ మధ్య మన అమరావతి గురించి ఏదేదో వాగింది పాకిస్తాన్! మోదీ ప్రభుత్వం ఏపీలో కడుతోన్న అమరావతి ప్రత్యేక అణు నగరం అంటూ ప్రచారం చేసింది. అక్కడ అణు రియాక్టర్లు కూడా నిర్మిస్తోందంటూ కొన్ని ఫోటోలు చూపించింది. అవన్నీ ఉట్టివే! అయితే, కొన్నాళ్లు తన ఆరోపణల్ని పక్కన పెట్టిన పాకిస్తాన్ గురువారం నాడు మరోసారి తన పిచ్చి వాగుడు మొదలు పెట్టింది. ఆ దేశ విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఒకరు ఇండియా స్పెషల్ న్యూక్లియర్ సిటీ నిర్మిస్తోందని చెప్పుకొచ్చారు. మన దేశం పోగేసిన అత్యంత శక్తివంతమైన అణు బాంబుల్ని ఆ స్పెషల్ న్యూక్లియర్ సిటీలో భద్రపరచనున్నట్టు ఆయన ఆరోపించాడు! పాక్ చెబుతోన్న ఆ సీక్రెట్ సిటీ అమరావతే కావటం ఇక్కడ అతి పెద్ద విడ్డూరం!

 

ఇండియన్ అధికారులు పాక్ చేస్తోన్న ఆరోపణలు పిచ్చి మాటలని కొట్టిపారేశారు! ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల్ని భారత్ లోకి ఎగతోసే పక్క దేశం తన ఆరాచకాల్ని కప్పి పెట్టేందుకు ఇలాంటి డ్రామాలు ఆడుతుంటుందని వారన్నారు. ప్రపంచం దృష్టిని మరల్చటానికి స్పెషల్ న్యూక్లియర్ సిటీ లాంటి అభూత కల్పనలు చేస్తుంటుందని వివరించారు!

 

ఏది ఏమైనా మన అమరావతి ఎలా వుండబోతోందో మనకే తెలియకపోయినా.. పాక్ దాని గురించి నానా తప్పుడు ప్రచారాలు చేస్తుండటం నిజంగా విడ్డూరమే!

 

google-ad-img
    Related Sigment News
    • Loading...