Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...భారత్ కి పట్టిన ఉగ్ర పీడ తొలిగినట్టేనా?
posted on: May 10, 2025 6:28AM

పాకిస్థాన్ ఆర్మీ అంతా కలసి జైష్- ఏ- మొహమ్మద్ ఆపరేషన్స్ కమాండర్.. రవూఫ్ అజర్ అంత్యక్రియల్లో పాల్గొని, పాకిస్థాన్ జెండా అతడి శవపేటికకు కప్పి నానా బీభత్సం చేసింది. దీన్నిబట్టీ చూస్తే పాకిస్థాన్ ఆర్మీకి, ఐఎస్ఐకి, ఉగ్రవాదానికి మధ్య ఎంత గట్టి బంధం ఉందో అర్ధం చేసుకోవచ్చు. భారత్ లో ఉగ్రభూతాన్ని పెంచి పోషించడంలో ఈ మూడూ ఉగ్రవాదం, పాక్ ఆర్మీ, ఐఎస్ఐ ఫెవికాల్ బంధంతో పని చేస్తున్నాయి. ఇంతకీ పాక్ ఆర్మీ ఆ దేశ జెండా కప్పి మరీ అంత్యక్రియలలో పాల్గొన్న రవూఫ్ ఎవరో కాదు.. 1999 హైజాక్ ద్వారా భారత్ నుంచి విడుదలైన మసూద్ అజర్ సోదరుడు. మసూద్ అజర్ ను భారత్ నుంచి విడిపించడంలో కీలక పాత్ర పోషించింది రవూఫే. అలాంటి రవూఫ్ అండ చూసుకున్న మసూద్ అజర్ తర్వాతి కాలంలో జైష్- ఏ- మొహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. 2000 సంవత్సరంలో కశ్మీర్ అసెంబ్లీ అటాక్, 2001లో భారత పార్లమెంటు పై దాడి, 2008లో ముంబై దాడులు, 2016లో మరో దాడి.. ఇక 2019 పుల్వామా దాడి సంగతి సరే సరి. ఈ దాడిలో ఏకంగా 46 మంది భారత జవాన్లు చనిపోయారు. నాటి నుంచి నేటి వరకూ వరకూ మసూద్.. భారత్ పై చేసిన ఉగ్రదాడులదొక రక్తసిక్త అధ్యాయం. ఒక రకంగా చెబితే ధ్వంస రచన. విధ్వంస రచన.
అలాంటి మసూద్ అజర్ కు ఆపరేషనల్ కమాండర్ గా అన్నీ తానై వ్యవహరించిన రవూఫ్ ఆపరేషన్ సందూర్ అంటూ ఇండియన్ ఆర్మీ ఉగ్రస్థావరాలు టార్గెట్ గా ఇండియన్ ఆర్మీ జరిపిన ఆపరేషన్ లో మరణించాడు. రవూఫ్ తో పాటు మసూద్ బంధువులు కూడా చనిపోయారు. వీరితో పాటు మరో నలుగురు అజర్ సన్నిహితులు సైతం బహా వల్పూర్ దాడుల్లో హతమయ్యారు. దీన్నిబట్టీ చూస్తే మసూద్ అజర్ పని ఖతమై నట్టే లెక్క. అందుకే అతడు ఈ దాడుల్లో తాను కూడా పోయి ఉంటే బావుండేదని అంటున్నాడు. మోడీ తన కుటుంబంలోని చిన్నారులు, మహిళలు, వృద్ధులను కూడా వదలకుండా హతమార్చాడాని వాపోతున్నాడు. తనకు ఈ మరణాల పట్ల పశ్చాతాపం కానీ, నిరాశగానీ లేవని అంటున్నాడు. కానీ అతడిలో ఈ దాడులు, వాటి ద్వారా ఏర్పడ్డ మరణాలతో రావల్సిన బలహీనతలన్నీ వచ్చేసినట్టే. మరీ ముఖ్యంగా తన కుడి భుజంగా పని చేసిన సోదరుడు రవూఫ్ మరణంతో జైష్- ఏ- మొహమ్మద్ కథ ముగిసినట్టే.
మసూద్ 18 ఎకరాల విస్తీర్ణంలో గల సుభాన్ అల్లా మసీదులో కూర్చుని, తీవ్రంగా ఆలోచించి.. లేని పోని మత విద్వేషాలతో కూడిన ప్రసంగాలు చేసి, కొత్త వారిని వాటి ద్వారా ఆకట్టుకుని, తద్వారా నిధులు సేకరించి.. ఉగ్ర వాదాన్ని వెర్రి తలలు వేయించేవాడు. ఇప్పుడు వీటన్నిటికీ చెక్ పడ్డట్టే లేక్క. మసూద్ మసీదులో కూర్చుని చేసే ఉగ్రాలోచన అమలు చేసేది రవూఫ్. అలాంటి రవూఫ్ లేక పోతే మసూద్ రెక్కలు తెగిన పక్షితో సమానం. పంజా కోల్పోయిన పులితో ఈక్వల్. ఇక తనకు తాను స్వతంత్రంగా ఏమీ చేయలేడు. ఒక వేళ చేసినా అదంతా తలా తోకా లేకుండా పోతుంది. ఒక దశ దిశా కనుమరుగు అవుతుంది.
మసూద్ తాను మాత్రం ఇక ఎందుకు చేయాలి? తమ్ముడితో పాటు అక్క ఆమె కుటుంబంతా చేజారి పోయింది? చివరికి మిగిలేది ఏమిటో పూర్తిగా బోధ పడ్డాక, తన ఉగ్ర బోధనలు, ఆలోచనలు మానుకోక ఏం చేస్తాడన్నది ఇప్పుడు అందరి అభిప్రాయం. ఈ దాడుల్లో అసలు తానుంటాడో ఉండడో కూడా తెలీదు. అలాంటి నైరాశ్యం మనసు నిండా పేరుకుని కనిపిస్తున్నాడు జైష్- ఏ- మొహమ్మద్ ఉగ్ర అగ్రనేత మసూద్ అజర్. ఒక సమయంలో భారత్ అంటే ఊగిపోయి ఉగ్ర పథక రచనలు చేసి ఈ రక్తపిపాసి.. ప్రస్తుతం ఒంటరి. సర్వం కోల్పోయిన వైరాగి. లష్కర్- ఏ- తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ పరిస్థితేంటని చూస్తే.. ప్రస్తుతం 75 ఏళ్ల వయసుగల హఫీజ్ లాహోర్ లోని జనసమర్ధ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఇటు పాక్ ఆర్మీ అటు సొంత సైన్యం మధ్య కట్టుదిట్టమైన భద్రతా దళాలు కాపలా కాస్తుండగా అతడి కుటుంబం ఒకింత సేఫ్ గానే ఉంది.
అయితే ముజఫరాబాద్ దాడుల్లో ఇతడి లష్కరే అలియాస్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ శిబిరం దాదాపు కుప్పకూలింది. ఈ శిబిరాన్ని దగ్గరుండి నడిపిస్తోంది మరెవరో కాదు హఫీజ్ సయీద్ కొడుకు.. తల్హా సయీద్. ఇతడు ప్రస్తుతం లష్కరే ఆర్ధిక విభాగపు కమాండర్ గా పని చేస్తున్నాడు. అయితే ఇతడు ఒక ఐదు మంది కమాండర్ల తో కలసి ఇక్కడి నుంచే టెర్రర్ ఆపరేషన్లను నిర్వహిస్తుంటాడు. ఇతడి కమాండర్లలో ఒకడైన రెహమానే పహెల్గాం దాడి సూత్రధారి.
ఈ విషయం గ్రహించిన భారత బలగాలు.. ఇతడి స్థావరంపై దాడి చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ దాడుల్లో తల్హా అతడి ఉగ్ర కమాండర్లు సైతం హతమైనట్టు ఒక పేరు చెప్పని అధికారి వెల్లడించారు. ఒక వేళ అదే నిజమైతే.. లష్కర్- ఏ- తోయిబా ఖేల్ కూడా ఖతమైనట్టే. కారణం హఫీజ్ ఉగ్ర నిధుల కేసుల తర్వాత పూర్తి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి భారత్ కి వ్యతిరేకంగా మోడిని ఇరవైనాలుగ్గంటలూ తిడుతూ.. తన విశ్వరూపం చూపిస్తున్నాడు.
అంతే కాదు.. యువకులను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్నాడు లష్కరే జూనియర్ చీఫ్ తల్హా. అంతేనా టెర్రర్ సపోర్టర్ల ద్వారా నిధుల సమీకరణ చేసి భారీ ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేస్తున్నాడు. తన లష్కరే ఉగ్రవాదులకు అధునాతన ఆయుధాలతో కూడిన శిక్షణనిస్తున్నాడు. దీంతో ఇతడు తండ్రి తర్వాత అంతటి కిరాతకుడిగా మారి.. ప్రపంచాన్ని మరీ ముఖ్యంగా భారత్ ని అట్టుడికిస్తున్నాడు..
అలాంటి తల్హా లాంటి తలను లష్కరే కోల్పోతే.. ఈ ఉగ్ర సంస్థ కూడా దాదాపు కనుమరుగై పోతుంది. దానికంటూ ఒక డైరెక్షన్ లేకుండా పోతుంది. ఇక ఈ సంస్థ కార్యకలాపాలు సైతం పూర్తిగా స్తంభించి పోతాయి. ప్రస్తుతం భారత్ విశ్వరూపానికి జడిసిన హఫీజ్ సయీద్.. పంజాబ్ ప్రావిన్స్ లో తలదాచుకున్నట్టు ఇటీవల తల్హా మాటలను బట్టి తెలుస్తోంది. ఏమో ఈ దాడుల్లో ఏదైనా జరగొచ్చు. కొడుకు తల్హాతో పాటు తండ్రి హఫీజ్ సయీద్ కూడా హతం కావచ్చు.
ఇప్పటికి అందుతున్న సమాచారాన్ని బట్టీచూస్తే.. ఇటు జేషే కి కీలకమైన రవూఫ్ హతమయ్యాడు. అధికారికంగా ఇంకా తెలీడం లేదు కానీ లష్కరేకి తలలా వ్యవహరిస్తోన్న తల్హా కూడా ఖతమైతే.. ఈ సంస్థ కూడా దాదాపు నిర్వీర్యమై పోయినట్లే. వీటికి తోడు మసూద్ హఫీజ్ సైతం హతమారిపోతే.. భారత్ కి పట్టిన ఉగ్ర పీడ వదిలిపోతుందని అంటున్నారు పాక్ వ్యవహారాల నిపుణులు.


.webp)
.webp)


