TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంగళగిరి రూరల్ పోలీసు స్టేషన్ లో పిల్ల సజ్జల.. ఎందుకంటే?

Published on: Wed May 28, 2025 12:05PM

వైసీపీ  సోషల్ మీడియా వింగ్ మాజీ హెడ్  పిల్ల సజ్జల అదేనండీ.. సజ్జల భార్గవరెడ్డి మంగళగిరి పోలీసు స్టేషన్ లో ఉన్నారు. సామాజిక మాధ్యమంలో అనుచిత వ్యాఖ్యలు కేసులో ఆయనకు జారీ అయిన నోటీసుల మేరకు విచారణకు ఆయన మంగళగిరి పోలీసు స్టేషన్ కు వచ్చారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ సూప్రీం కోర్టు వరకూ వెళ్లానా కూడా పిల్ల సజ్జలకు ఊరట లభించలేదు. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.

వైసీపీ హయాంలో సోషల్ మీడియా వింగ్ బాధ్యతలు చేపట్టిన సజ్జల భార్గవ్ రెడ్డి  అప్పటి ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులపై  అనుచిత, అసభ్య, అశ్లీల పోస్టులతో రెచ్చిపోయారు. అయితే.. గత ఎన్నికలలో వైసీపీ పరాజయం పాలై.. అద్భుత విజయంతో తెలుగుదేశం కూటమి అధకార పగ్గాలు అందుకున్న తరువాత సజ్జల భార్గవ్ రెడ్డిని ఆయన తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి చాకచక్యంగా వైసీపీ సోషల్ మీడియా వింగ్ నుంచి తప్పించేశారు. ఆ తరువాత   సజ్జల భార్గవ్ రెడ్డి ఎక్కడా కనిపించింది లేదు. వినిపించింది లేదు. అయతే చేసిన తప్పులు వదలవుగా..  జగన్ హయాంలో సోషల్ మీడియాలో ఇష్టారీతిగా పెట్టిన పోస్టులపై  కేసు నమోదయ్యింది. దీంతో ఈ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ సజ్జల భార్గవ్ రెడ్డి తొలుత హైకోర్టునూ అక్కడ చుక్కెదురవ్వడంతో సుప్రీం ను ఆశ్రయించారు. సజ్జల ముందస్తు బెయిలు పిటిషన్ పై  ఈ నెల 23న విచారించిన సుప్రీం కోర్టు ఆయన పిటిషన్ ను కొట్టివేసింది. అయితే రెండు వారాల వరకూ అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ, ఆ లోగా సంబంధింత ట్రయల్ కోర్టును ఆశ్రయించాలన పేర్కొంది.  

అదే సమయంలో అంటే  సజ్జల భార్గవ్ రెడ్డి పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం  సోషల్ మీడియాలో మీరు పెట్టిన పోస్టులు మాకు అర్థం కాలేదని భావిస్తున్నారా?  ఏ ఉద్దేశంతో ఆ పోస్టులు పెట్టారో మేము గ్రహించలేమని అనుకుంటున్నారా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.   సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే కేసుల్లో అంత తేలిగ్గా బెయిల్ లభిస్తుందని ఆశించవద్దని కూడా పేర్కొంది. దీంతో ఆయన తప్పని సరిగా తనకు అందిన నోటీసుల మేరకు పోలీసుల విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే సజ్జల భార్గవ్ రెడ్డి బుధవారం (మే 28)  విచారణకు హాజరయ్యారు.  పోలీసుల నోటీసుల మేరకు ఆయన బుధవారం  మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాల్సి ఉంది. అయితే సజ్జల భార్గవ్ రెడ్డి మాత్రం అంత కంటే ముందుగానే పోలీసు విచారణకు హాజరయ్యారు.