సంక్రాంతి ముసుగులో ఏపీ ఆర్టీసీ దోపిడి..

posted on: Jan 7, 2022 6:02PM

సంక్రాంతి పండుగ సందడి తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. ఈ సందర్భంగా వేలాది కుటుంబాలు ఇప్పటికే తమ సొంతూళ్లకు పయనం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు ఒక్కసారిగా చైతన్యాన్ని నింపుకున్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత వరకు స్పెషల్ బస్సులు ప్రత్యేకంగా నడిపే కార్యాచరణను ప్రకటించాయి. అయితే.. సంక్రాంతి ముసుగులో ఏపీఎస్సార్టీసీ ప్రయాణికులపై 50 శాతం అదనపు భారం వేసి దోపిడీకి సిద్ధం అయింది. మరో పక్కన తెలంగాణ ఆర్టీసీ మాత్రం సాధారణ రోజుల్లో మాదిరిగానే చార్జీలు తీసుకుంటామని ప్రకటించడం విశేషం. టీఎస్సార్టీసీ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ వరప్రసాద్ ఈ విషయం స్పష్టం చేశారు.

సంక్రాంతి ప్రయాణికుల కోసం ఏపీఎస్ ఆర్టీసీ ఏకంగా ఈ నెల 18 వరకు 6,970 ప్రత్యేక బస్సులు నడుపుతుంది. తెలంగాణ స్టేట్ ఆర్టీసీ యాజమాన్యం ఈ నెల 7నుంచి 14వ తేదీ వరకు 4,318 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది.. ఏపీఎస్సార్టీసీ 6,970 ప్రత్యేక బస్సులు నడుపుతోంది.  

ఏపీఎస్సార్టీసీ అయితే.. పండుగ పేరు చెప్పి 50 శాతం అదనంగా టికెట్ ధర వసూలు చేస్తామని వెల్లడించింది. దీనికి ఏపీఎస్సార్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఇచ్చే వివరణ ఒకటే.. ఒక వైపు ఖాళీగా వచ్చే బస్సు మొత్తం భారాన్ని తమ సంస్థ మోయలేదంటున్నారు. ఆ భారంలో సగం మాత్రమే ప్రయాణికులను అడుగుతోందట. పైగా.. ఏపీఎస్సార్టీసీ బస్సుల్లోని సౌకర్యాలు, సంస్థ సిబ్బంది సేవలు చూడాలని సెలవిచ్చారాయన. ఇతర బస్సుల్లో చార్జీలు చూడొద్దని, సంక్రాంతికి సొంతూళ్లకు ప్రయాణికులను ఆప్యాయంగా చేరుస్తామని, అంతే గౌరవంగా వారి వారి గమ్యాలకు చేరుస్తామని ఎండీ ద్వారకా తిరుమలరావు సార్ ప్రవచించడం గమనార్హం. అయితే.. పండుగల పేరు చెప్పి అదనపు చార్జీలు వసూలు చేయబోమని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గతంలోనే ప్రకటించడం విశేషం.

ఏపీఎస్సార్టీసీ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నిర్వహిస్తోంది. రెగ్యులర్ సర్వీసులు యధాతథంగానే ఉంటాయని ఏపీఎస్సార్టీసీ ఎం.డీ ద్వారకా తిరుమలరావు వివరణ. సంక్రాంతి పండుగకు ముందు 9000 సీరీస్ తో రోజుకు 470 చొప్పులు మొత్తం 4,145 బస్సులు, తిరుగు ప్రయాణాలకు రోజుకు 400 చొప్పున 2.825 బస్సులను ఏపీఎస్సార్టీసీ నడుపుతుంది. టీఎస్సార్టీసీ అయితే.. తెలంగాణలోని నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, సిద్దిపేట లాంటి పట్టణాలకు సంక్రాంతి ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ఏపీలోని విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, పోలవరం, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖపట్నం, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపురం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కందుకూరు, పామర్రు, పొదిలి తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా సాధారణ చార్జీలతోనే ఈ సర్వీసులు నిర్వహించాలని టీఎస్సార్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించడం విశేషం. ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ నెల 7 నుంచి 14 వరకు హైదరాబాద్ లోని బీహెచ్ఈఎల్, మియాపూర్, కేపీహెచ్ బీ, దిల్ సుఖ్ నగర్, ఈసీఐఎల్, ఎల్బీ నగర్, ఆరాంఘర్ పాయింట్ల నుంచి ఏపీలోని ఆయా ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.

ఏపీ, తెలంగాణ ఆర్టీసీ ఎండీలిద్దరూ ఐపీఎస్ లే. సీనియర్ పోలీస్ ఉన్నతాధికారులుగా పనిచేసిన వారే. అటు ద్వారకా తిరుమలరావు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా, ఇటు సజ్జనార్ సైబరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వర్తించారు. అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వాల తీరు మేరకు వారిద్దరూ ఆర్టీసీ ప్రత్యేక బస్సుల చార్జీల విషయంలో చెరో నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

google-ad-img
    Related Sigment News
    • Loading...