తెలంగాణ కాంగ్రెస్ నేతల సభలో జేసీ దివాకర్ రెడ్డి
posted on Sep 10, 2013 3:51PM
ఒక సమైక్యాంధ్ర ప్రయత్నాలు, మరో వైపు రాయల తెలంగాణ ప్రయత్నాలు ఏదయితే అదయింది ఏదో ఒక ప్రయత్నం నెరవేరితే చాలు అన్నట్లు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్న తరువాత జేసీ దివాకర్ రెడ్డి ఎలాగయినా రాయల తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
సమైక్యాంధ్ర కొరకు ప్రయత్నిస్తున్న మంత్రి సాకె శైలజానాథ్ కు భంగపాటు తప్పదని, రాయల తెలంగాణ కొరకు కలసి రావాలని, ఆయన రాకున్నా కర్నూలు, అనంతపురం జిల్లాల నేతలను కలుపుకుని రాయల తెలంగాణ కోరతానని జేసీ చెబుతూ వస్తున్నారు. ఇటీవల ఏపీఎన్జీఓల సభ విజయవంతం అయినప్పుడు జేసీ ముఖ్యమంత్రిని కలిశారు. ఇప్పుడు తాజాగా రాయల తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని ఏకంగా సీఎల్పీలో కాంగ్రెస్ తెలంగాణ నేతల సమావేశానికి వెళ్లి కోరారు. అయితే వారు దానికి నిరాకరించారు. మా రాష్ట్రానికి మీరు గవర్నర్ గా రావాలని కోరారు. ఈ సంధర్భంగా జేసీ జై ఆంధ్రప్రదేశ్ నినాదాలు ఇవ్వగా తెలంగాణ నేతలు జై తెలంగాణ నినాదాలు ఇచ్చారు.