TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రోజాకి పంచ్ పడిందిగా.. పరువు పోయిందిగా!

Published on: Tue Sep 24, 2024 12:31PM

అడిగి మరీ తన్నించుకోవడం అంటే ఏంటో వైసీపీ నాయకురాలు రోజాని చూస్తే అర్థమవుతుంది. ఏ విషయంలో అయినా నోరు వేసుకుని పడిపోతూ, అబద్ధాన్ని నిజం చేయడానికి, నిజాన్ని అబద్ధం చేయడానికి రోజా ప్రయత్నిస్తూ వుంటారు. తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ విషయంలో కూడా ఆమె తన నోటికి పనిచెప్పారు. సోమవారం నాడు తన సొంత యూట్యూబ్ ఛానల్లో కర్ణకఠోరంగా మాట్లాడారు. ఆ తర్వాత ఆమె తన యూట్యూబ్ ఛానల్లోనే ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టారు. అందులో ఒక ప్రశ్న ఏమిటంటే, ‘తిరుమల లడ్డూ కల్తీలో తప్పు ఎవరిది?’. దీనికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, జగన్ ఫొటోలు పెట్టి మూడు ఆప్షన్లు ఇచ్చారు. దీనికి పవన్ కళ్యాణ్ తప్పు అని 7 శాతం, చంద్రబాబు తప్పు అని 20 శాతం, జగన్‌దే తప్పు అని 73 శాతం ఓట్లు పడ్డాయి. మరో ప్రశ్న ఏమిటంటే, ‘వీరిలో తిరుమల ఎవరి పాలనలో బాగుంది?’ ఈ ప్రశ్నకు చంద్రబాబు పాలన బాగుందని 80 శాతం మంది ఓట్లు వేస్తే, వైఎస్ జగన్ పాలన బాగుందని 20 శాతం మంది అన్నారు. రోజా పెట్టిన ఈ ఓటింగ్‌లో వైఎస్ జగన్ మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పటికీ పోలింగ్ నిలిపివేయకుండా ఉంచడం విశేషం. పోలింగ్ సంగతి అలా వుంటే, పోలింగ్ కింద వున్న కామెంట్లు అయితే మామూలుగా లేవు. రోజాని, జగన్‌కి దారుణంగా తిడుతున్నారు. ఆ తిట్లను మనందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఇవ్వడం లేదు. ఇలా పోలింగ్ పెట్టడం ద్వారా అడిగి మరీ తన్నించుకుంటున్న రోజాకి అభినందనలు. 

ఆర్కే రోజా తన యూట్యూబ్ ఛానల్ని సంవత్సరం క్రితం ప్రారంభించారు. తాను దగ్గినా, తుమ్మినా కూడా ఈ ఛానల్లో పోస్ట్ చేశారు. వెయ్యికి పైగా వీడియోలు వున్నాయి. కాకపోతే ఛానల్ డిస్క్రప్షన్ చూస్తే మాత్రం జాలి కలిగేలా వుంది. ఎందుకంటే, దాంట్లో రోజా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగానే వుంది. పాపం రోజా తన ఓటమిని ఇంకా జీర్ణించుకోలేదని అర్థమవుతోంది.