ఆర్టీజీఎస్ ద్వారా శాఖల సమీక్ష.. ప్రభుత్వ సేవల్లో జవాబుదారీతనం పెంచడమే లక్ష్యం!
posted on: Feb 24, 2026 9:19AM

ఏపీ ప్రభుత్వం పారదర్శక పాలన దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, వేగం, జవాబుదారీతనం పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు, టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు సాగాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సోమవారం (ఫిబ్రవరి 23) రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ద్వారా వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఇకపై ఉద్యోగుల పనితీరును శాస్త్రీయంగా విశ్లేషించి వారికి వెయిటేజ్ ఇస్తారు. అద్భుతమైన పనితీరు కనబరిచే అధికారులకు, సిబ్బందికి ప్రభుత్వం నుంచి అధికారికంగా అభినందన లేఖలు అందజేస్తారు. ఇది ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతుందని సీఎం ఆకాంక్షించారు.
ఆస్పత్రుల్లో వైద్యుల కొరత లేకుండా చూడాలని, రోగులకు మెరుగైన వైద్యం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీటి నాణ్యతను పరీక్షించేందుకు మొబైల్ ల్యాబ్స్ అందుబాటులోకి తేవాలని, తద్వారా పలు వ్యాధులను అరికట్టవచ్చని సూచించారు. రెవెన్యూ శాఖలో పారదర్శకత పెంచాల్సిన అవసరం ఉందని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సేవలందించేలా ఆ శాఖకు సరికొత్త రూపు తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు. ఇకపై ఆర్టీజీఎస్ ద్వారా ప్రతి శాఖ పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. ప్రభుత్వం టెక్నాలజీ ద్వారా అందిస్తున్న సేవలను సామాన్యులు కూడా సులభంగా వినియోగించుకునేలా ప్రత్యేక అవగాహన కార్యాచరణను రూపొందించాలని ఆదేశించారు.



.webp)



