తెలంగాణలో పొలిటికల్ డ్రామా! స్క్రిప్ట్ లీక్ చేసిన రేవంత్ రెడ్డి..

posted on: Jan 4, 2022 4:05PM

తెలంగాణలో హాట్ హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ప్రస్తుతం కరీంనగర్ జైలులో ఉన్నారు. ఉద్యోగ , ఉపాధ్యాయ సమస్యలపై కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో జాగరణ దీక్ష తలపెట్టిన బండి సంజయ్ ని బలవంతంగా అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సందర్భంగా అక్కడ యుద్దమే జరిగింది. సంజయ్ ను అదుపులోనికి తీసుకునేందుకు కార్యాలయం గేట్లు బద్దలు కొట్టారు పోలీసులు. గ్యాస్ కట్టర్లు ఉపయోగించారు. బీజేపీ కార్యకర్తలను తరిమికొట్టారు. సంజయ్ అరెస్ట్ సమయంలో బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతనిపై ఏకంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. 

డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ తో పాటు పోలీసుల విధులకు ఆటంకం కల్గించారనే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో కరీంనగర్ జైలుకు వెళ్లారు బండి సంజయ్.పార్టీ అధ్యక్షుడే జైలుకు వెళ్లడంతో బీజేపీ శ్రేణులు రగిలిపోతున్నాయి. 14 రోజుల నిరసనలకు పిలుపిచ్చాయి. సంజయ్ ను జైలులో పెట్టడానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కమలం కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. కరీంనగర్ జైలుకు వెళ్లి సంజయ్ ను పరామర్శించిన కిషన్ రెడ్డి.. తెలంగాణలో నియంత పాలన సాగుతుందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా సంజయ్ పై అరెస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ వస్తున్నారు.

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ కావడం, ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న బీజేపీ శ్రేణులు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ర్యాలీకి సిద్ధపడడం వంటి పరిణామాలపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. డ్రామా మొదలైంది అంటూ వ్యాఖ్యానించారు. బండి సంజయ్ అరెస్ట్ తో పార్ట్-1 పూర్తయిందని, పార్ట్-2లో భాగంగా జేపీ నడ్డా గారిని ఇవాళ కస్టడీలోకి తీసుకుంటారని వెల్లడించారు. ఇదంతా కూడా బీజేపీనే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమని చూపించడం కోసమేనా? అని రేవంత్ ప్రశ్నించారు."సరే, ఈ విషయం నేను బహిర్గతం చేశాను కాబట్టి, డ్రామా ఎలా సాగుతుందో చూద్దాం" అంటూ ట్వీట్ చేశారు.  

మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్న బీజేపీ క్యాండిల్ ర్యాలీ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. జేపీ నడ్డాను విమాశ్రయంలోనే పోలీసులు అడ్డుకుంటారనే ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయం చెబుతూ ట్వీట్ చేశారు. దీంతో రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే జేపీ నడ్డాను ఎయిర్ పోర్టులోనే పోలీసులు అడ్డుకుంటారా.. ఆయన ఆరోపించినట్లే తెలంగాణలో రాజకీయ డ్రామా జరుగుతుందా అన్న చర్చ జనాల్లో సాగుతోంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...