ప్రహసనంగా మారిన కౌలురైతుల రుణమంజూరు?

posted on: Aug 9, 2012 12:28PM

రాష్ట్రప్రభుత్వం రైతులు, కౌలురైతులు గుర్తింపుకార్డుల జారీ విషయంలో ప్రకటించిన చిత్తశుద్ధి రుణమంజూరుల్లో కనిపించటం లేదని ఆందోళనలు ఎక్కువయ్యాయి. అసలు కార్డుల ఆథారంగా బ్యాంకురుణాలు మంజూరు అన్న ప్రక్రియే రాష్ట్రంలో సక్రమంగా సాగటం లేదు. కేవలం ప్రభుత్వం రైతుశ్రేయస్సు ఆశించేదిలా కనిపించే ప్రహసనంలా ఈ కార్యక్రమం చేపట్టిందని విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ ఏడాది 12లక్షల మంది కౌలురైతులకు కార్డులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఈ కార్డుల ద్వారా బ్యాంకులు రెండువేల కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది.

 

 

 

అయితే ఖరీఫ్‌సీజన్‌ ప్రారంభమై నెలదాటినా ఇప్పటివరకూ 1.13లక్షల కార్డులు కొత్తగా మంజూరు చేశారు. మొత్తం 25,294మంది కౌలురైతులకు రుణాలిచ్చారు. ఇంకా సుమారు 11లక్షల కార్డులను రాష్ట్రవ్యాప్తంగా ఎప్పటికి కౌలురైతులకు మంజూరు చేయగలరు? బ్యాంకు రుణాలు ఎప్పుడు మంజూరు చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం తన రాజకీయ సంక్షోభంలో పడి ఇటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. గతేడాది 25,294మంది కౌలురైతులకు రూ.55.94కోట్ల పంటరుణాలు మంజూరు చేశారు. దీనిలో ఒక్కపశ్చిమగోదావరి జిల్లా నుంచే 16,793మందికి రుణం కింద రూ.37.96కోట్లు మంజూరు చేశారు. మిగతా జిల్లాల్లో ఈ రుణాలు నామమాత్రంగా మంజూరయ్యాయి. సిఎం సొంత జిల్లా చిత్తూరులోనూ కౌలురైతులకు అన్యాయం జరిగింది. ఈ జిల్లాలో ఇప్పటి వరకూ 13,927మందికి కౌలురైతుకార్డులు మంజూరయ్యాయి. ఇప్పటి వరకూ ఒక్క రుణం కూడా ఈ జిల్లాలో మంజూరు కాలేదు. దీంతో అక్కడి కౌలురైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్డులు చూపి రుణం పొందే అవకాశం తమకు ఎందుకు కల్పించలేదని సిఎంను సైతం నిలదేసేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం చిత్తశుద్థితో కౌలుదారులకు రుణాలు మంజూరు చేయాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...