'అనంత' చరిత్ర మార్చటం సాధ్యమేనా?

posted on: May 19, 2012 11:24AM

రాయసీమ జిల్లా కేంద్రమైన అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెసు, తెలుగుదేశం, కమ్యూనిస్టు పార్టీలతో ముడిపడిన చరిత్ర ఉంది. ఇప్పటివరకూ ఈ మూడు పార్టీల అభ్యర్థులనే ఓటర్లు గెలిపించారు. అయితే వచ్చే ఉప ఎన్నికల్లో ఈ రికార్డును తిరగరాయాలని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి భావిస్తున్నారు. తన పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డికి టిక్కెట్టు ఇచ్చారు. ఈయనపై అసలే భూ కుంభకోణం వంటి పలు కేసులున్నాయి. ఈ నేరచరిత్ర వల్ల ఆయనకు విజయావకాశాలు తక్కువని స్థానిక ఓటర్లు కొందరు 'తెలుగువన్.కామ్'కు చెప్పారు.

 

 

ఒకవేళ ఆయన గెలిస్తే మాత్రం చరిత్రను తిరగరాసినట్లే అని స్పష్టమవుతోంది. ఈ నియోజకవర్గం ఏర్పడిన తరువాత ఇప్పటివరకూ 14సార్లు ఎన్నికలు జరిగాయి. వాటిలో 9సార్లు కాంగ్రెస్, 2సార్లు తెలుగుదేశం, ఒక్కసారి (ప్రారంభ ఎన్నికల్లో మాత్రమే) కమ్యూనిస్టులు గెలుపొందారు. 1952లో ఈ నియోజకవర్గం ఏర్పాటు అయింది. లక్షా 85వేలమంది ఓటర్లలో బిసిలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం ఇదే. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత రెండుసార్లు గెలుపొందింది. ఈ నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ ఈ ఎన్నికల్లో తప్పదంటున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గుర్నాథరెడ్డి పోటీ చేశారు. ఈ సారి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున రంగంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ముషిరాబేగం, తెలుగుదేశం పార్టీ తరపున మహాలక్ష్మీశ్రీనివాస్ పోటీలో ఉన్నారు. ఈయన దప్పుల మ్రోతతోనూ, మేళాలతోనూ వినూత్న తరహాలో ప్రచారం చేసి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. సిపిఎం అభ్యర్థిగా రాంభూపాల్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈయనకు లోక్ సత్తా మద్దతు ప్రకటించింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...