నామినేషన్లతో జోరెక్కుతున్న ఎన్నికల ప్రచారం ...

posted on: May 19, 2012 10:13AM

ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల ఘట్టానికి తెరలేవటంతో అన్ని రాజకీయపార్టీలూ తమ ప్రచారం వేళలను పెంచుకున్నాయి. ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు తోడురాగా అభ్యర్థులు మండుటెండలో తిరగటానికి సిద్ధపడుతున్నారు.

 

 

ఈ ప్రచారంలో పాల్గొనే పార్టీలు ఢిల్లీ నేతలూ రాష్ట్రంలో తమ కార్యక్రమాలను రూపొందించుకున్నారు. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల పరిశీలకుడు వాయలార్ రవి ఇక రాష్ట్రంలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. అలానే సర్వేల ఆధారంగా తమ అభ్యర్థి విజయావకాశాలనుపరిశీలించే నేతలూ ప్రత్యామ్నాయంగా ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రత్యేకించి బలహీనంగా ఉన్న అభ్యర్థుల గురించి ఇప్పటికే రాజకీయ పార్టీలు అన్నీ ఒక అవగాహనకు వచ్చాయని తెలిసింది. ఆ ప్రదేశాల్లో ప్రచార బాధ్యతను సమీపంలోని నేతలతో పాటు పార్టీలో ప్రముఖవక్తలను కూడా తోడిచ్చి పంపేందుకు

 

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఏర్పాట్లు చేసుకున్నాయి. రాష్ట్రంలోని 18 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానానికి ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానాల్లో నామినేషన్ల స్వీకరణకు 25వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. 26న పరిశీలన, 28న జాబితా ప్రకటన జూన్ 12న పోలింగ్, 15న ఓట్ల లెక్కింపు జరుగుతాయి. ఈ షెడ్యూల్ పై అవగాహన ఉన్న అభ్యర్థులు ముందుగానే తమ జ్యోతిష్యులను సంప్రదించి వార సూచనల మేరకు నామినేషన్ ముహూర్తాన్ని నిర్ణయించుకున్నారు. నిన్నటిదాకా తమకు టిక్కెట్టు వస్తుందో లేదో అని ఎదురు చూసిన అభ్యర్థులు పార్టీ ప్రకటన పూర్తయ్యాక జ్యోతిష్యులను సంప్రదిస్తున్నారు. ఈ సంప్రదింపులతో పాటు సమయం తక్కువగా ఉన్నందున ప్రచారంపై అభ్యర్థులు ద్రిష్టి సారించారు.

 

ఇప్పటి వరకూ ప్రచారంలో పార్టీలు పోటాపోటీగా ఉన్న కర్నూలు జిల్లాలో పట్టణాలపై పట్టుకోసం నేతలు ప్రణాలికలు రూపొందిస్తున్నారు. అలానే తిరుపతిలో కాంగ్రెస్, టిడిపి, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థులు ముందుగానే ప్రచారాన్ని ప్రారంభించి కొనసాగిస్తున్నారు. కొత్తగా బిజెపి అభ్యర్థి మధుసూదన్ కూడా ప్రచారం ప్రారంభించారు. గుంటూరు జిల్లా మాచార్లలోనూ, ప్రత్తిపాడులోనూ మూడు ప్రధానపార్టీలు పోటాపోటీ ప్రచారం చేసుకుంటున్నాయి. ప్రత్తిపాడులో లోక్ సత్తా అభ్యర్థి కూడా ప్రచారం ప్రారంభించారు. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమావ్వటంతో ప్రచార సమయం తగ్గిపోయిందని అభ్యర్థులు భావిస్తున్నారు. అయితే గుంటూరు జిల్లాకు దేశం అధినేత చంద్రబాబు వచ్చి వెళ్ళారు.

 

 

ఇప్పుడు కాంగ్రెస్ నేతలు రానున్నారు. ప్రత్యేకించి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్సా, రాజ్యసభ్యుడు చిరంజీవి కూడా వస్తారు. అలానే తెలుగుదేశం పార్టీ తరపున సినీనటుడు బాలకృష్ణ వస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లాలో మూడు పార్టీలూ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. తామే గెలిచే అభ్యర్థులమని ఓటర్లకు పరిచయం చేసుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...