ఐఏఎస్‌ లను వణికిస్తోన్న సీబీఐ దర్యాప్తు

posted on: Feb 3, 2012 1:44PM

హైదరాబాద్ : సీబీఐ దర్యాప్తు తీరుపై ఐఏఎస్‌ అధికారుల్లో కలకలం మొదలైంది. సీబీఐ తీరు ఇలానే ఉంటే ఐఏఎస్‌లకు ఇబ్బందులు తప్పకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మార్ వంటి కేసుల్లో ఐఏఎస్ అధికారుల అరెస్టుల నేపథ్యంలో సీనియర్ ఐఏఎస్‌లు పలువురు శుక్రవారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. సుమారు పదిహేను మంది అధికారులు దాదాపు అరగంట పాటు సమావేశమయ్యారు. పలువురు ఐఏఎస్‌లు ఇప్పటికే సిబిఐ తీరుపై మండిపడుతున్నారన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రుల్ని వదిలేసి తమరినే ఇరికించాలన్నట్టు సాగుతున్న సీబీఐ దర్యాప్తు నేపధ్యంలో ఐఏఎస్‌లు సమావేశమైనట్టు సమాచారం. మొదట శ్రీలక్ష్మి తదితరుల ఐఏఎస్ అధికారుల అరెస్టును అంత సీరియస్‌గా తీసుకోనప్పటికీ వరుసగా అధికారులనే సిబిఐ అరెస్టు చేయడాన్ని వారు తప్పు పడుతున్నట్లుగా సమాచారం. సీబీఐ చేస్తున్న దర్యాప్తు తీరుపై ముఖ్యమంత్రి, మంత్రులు గానీ స్పందించకపోవటంపై ఐఏఎస్‌లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. విచారణ పేరుతో కేవలం అధికారులనే గంటల తరబడి విచారించడాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకు వెళ్లేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అయితే అంతకుముందు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలవాలని వారు నిర్ణయించుకున్నారు. సాయంత్రం సిఎంను కలిసి ఈ విషయంపై ఆయనతో చర్చించనున్నారు. శ్రీలక్ష్మి, బిపి ఆచార్య ఇలా వరుసగా ఐఏఎస్‌లనే లక్ష్యంగా చేసుకోవడాన్ని వారు సిఎం దృష్టికి తీసుకు వెళ్లనున్నారని సమాచారం. విచారణ పేరుతో ఐఏఎస్‌లనే ప్రశ్నించడం ద్వారా తమ ప్రతిష్ట దెబ్బతింటోందని వారు చెప్పనున్నారని తెలుస్తోంది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...