తెరపైకి మంత్రివర్గ విస్తరణ..మళ్ళీ ఢిల్లీకి సీఎం

posted on: Feb 2, 2012 10:19AM

హైదరాబాద్:  సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మరోమారు ఢిల్లీకి వెళ్లనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో మంత్రి వర్గ విస్తరణ చేయనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీ అధిష్టానం మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వనప్పటికీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఇందుకోసం తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లుగానే కనిపిస్తోంది. విస్తరణ సాధించి తద్వారా తన సత్తా నిరూపించుకునే ప్రయత్నాల్లో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. అధిష్టానం ఉత్తర ప్రదేశ్ ఎన్నికల పర్వంలో బిజీగా ఉన్నప్పటికీ ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా ఉన్నారని అంటున్నారు. ఇటీవల విస్తరణ కోసం సిఎం ప్రయత్నాలు చేసినప్పటికీ అధిష్టానం మాత్రం కేవలం చిరంజీవి వర్గానికి చెందిన ఇద్దరితో మాత్రమే సరిపుచ్చాలని సూచించింది. దీంతో కిరణ్ మాట అధిష్టానం వద్ద చెల్లుబాటు కాలేదని ప్రచారం జోరుగా జరిగింది. ఈ ప్రచారానికి చెక్ పెట్టడంతో పాటు తన వర్గానికి చెందిన వారితో విస్తరణ జరిపేందుకు అదీ ఈ బడ్జెట్ సమావేశాలలోగా పూర్తయ్యేందుకు సిఎం తీవ్రంగా యత్నిస్తున్నారని సమాచారం.


కనీసం తెలంగాణ ప్రాంత నేతలనైనా మంత్రివర్గంలో తీసుకునేందుకు అనుమతివ్వాలని ఆయన అధిష్టానాన్ని కోరుతున్నారట. ఇటీవల కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావులు మంత్రి పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా శంకర రావును బర్తరఫ్ చేశారు. ఈ స్థానాలు తెలంగాణ ప్రాంతానికి చెందినవే. ఇప్పటికే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తెలంగాణవాదులు అంటోన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కాకపోయినా ఈ నాలుగు స్థానాల భర్తీ కోసమైనా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. మరో వైపు కిరణ్ చేపట్టే పలు పథకాలపై రాష్ట్ర ఎంపీలు వ్యతిరేకతను వ్యక్తం చేసి అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారన్న కథనాలు వినిపించాయి. దీంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు హైకమాండ్‌తో గ్రీన్ సిగ్నల్ కోసం శుక్రవారం, లేదా శనివారం సీఎం ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...