ఐఏఎస్‌లపై సీబీఐ కొరడా..ఎమ్మార్‌ నిందితులుగా ఎల్వీ,కేవీ

posted on: Feb 2, 2012 9:07AM

హైదరాబాద్: వైఎస్ ప్రభుత్వం చేసిన పాపాలు ఐఏఎస్‌ల మెడకు శాపాల్లా చుట్టుకుంటున్నాయి. 'అయ్యాఎస్'లు ఒక్కొక్కరుగా కటకటాల పాలవుతున్నారు. ఓఎంసీ కేసులో అరెస్టయి ఎర్రా శ్రీలక్షి ఇప్పటికే జైల్లో ఉండగా.. ఎమ్మార్ కేసులో బి.పి.ఆచార్య శ్రీకృష్ణ జన్మస్థానంలో గడుపుతుండగా.. మరో ఇద్దరు ఐఏఎస్‌లపై సీబీఐ ఇప్పుడు కొరడా ఝళిపించింది. టీటీడీ ఈవో, ఎల్.వి.సుబ్రహ్మణ్యం, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి కె.వి.రావును 'ఎమ్మార్' నిందితులుగా ప్రకటించింది. వీరిద్దరితో కలిపి మొత్తం 12 మందిపై అభియోగాలు మోపుతూ.. 50 వేల పేజీల భారీ చార్జ్‌షీట్‌ను సీబీఐ బుధవారం దాఖలు చేసింది. ఎల్.వి.సుబ్రహ్మణ్యం, కె.వి.రావులను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎమ్మార్ కేసులోనే అరెస్టు చేసిన జగన్ బంధువు సునీల్‌రెడ్డి, ఎమ్మార్ ఎండీ శ్రవణ్‌గుప్తా, ఎమ్మార్ ఆర్థిక విభాగం అధిపతి విజయరాఘవ పేర్లను మాత్రం చార్జ్‌షీట్‌లో ప్రస్తావించ లేదు. వీరిపై సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో అభియోగాలు నమోదు చేస్తామని సీబీఐ ప్రకటించింది. మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసులో సీనియర్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రాను సీబీఐ అధికారులు బుధవారం 4 గంటల పాటు విచారించారు.


ఎమ్మార్ కుంభకోణంపై తాము దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో 12 మంది నిందితుల పేర్లను పొందుపరిచినట్లు సీబీఐ కోర్టుకు.. సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నాంపల్లి సీబీఐ కోర్టులో.. ఎమ్మార్ కేసులో చార్జ్‌షీటును దాఖలు చేశారు. దిల్‌కుషా గెస్ట్‌హౌస్ నుంచి ఆరు పెట్టెల్లో పలు రికార్డులను తీసుకొచ్చిన సీబీఐ అధికారులు వాటిని కోర్టుకు అప్పగించారు. అనంతరం న్యాయమూర్తి జస్టిస్ నాగ మారుతీ శర్మ చార్జ్‌షీట్‌లో ఉన్న 12 మంది నిందితుల పేర్లను చదివి వినిపించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...