కెసిఆర్‌తో నాగం మంతనాలు

posted on: Jan 25, 2012 2:45PM

హైదరాబాద్: తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్ రెడ్డి  తెలంగాణ రాష్ట్ర సమితి  అధ్యక్షుడు కెసిఆర్ ఇంటికి వచ్చి మంతనాలు జరిపారు. ఆయన  తాను పోటీ చేయదలుచుకున్న మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు శానససభా స్థానంలో తనకు మద్దతు ఇవ్వాలని కోరేందుకే నాగం జనార్దన్ రెడ్డి కెసిఆర్ వద్దకు వచ్చినట్లు చెబుతున్నారు. తెలంగాణపై నారా చంద్రబాబు నాయుడి వైఖరిని నిరసిస్తూ నాగం జనార్దన్ రెడ్డి తన శాసనసభా సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దాంతో నాగర్ కర్నూలు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తర్వాత నాగం జనార్దన్ రెడ్డి తెరాసలో చేరుతారనే ప్రచారం జరిగింది. కెసిఆర్ కూడా నాగం జనార్దన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించినట్లు చెబుతారు. అయితే, ఆయన ఏ పార్టీలోనూ చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేయలేదు. తెలంగాణ నగారా సమితిని స్థాపించి స్వతంత్రంగానే వ్యవహరిస్తున్నారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో నాగం జనార్దన్ రెడ్డికి తాము మద్దతిస్తామని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ ఇప్పటికే ప్రకటించారు. తెరాస కూడా నాగం జనార్దన్ రెడ్డికి మద్దతిచ్చే అవకాశాలున్నాయి. అయితే, నాగం జనార్దన్ రెడ్డికి, కెసిఆర్‌కు మధ్య జరిగిన భేటీ ఆ మేరకే పరిమితమైందా, ఇంకేమైనా విషయాలు ఉన్నాయా అనేది తెలియడం లేదు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...