తెలివి లేక పార్టీ మారా - విశ్వేశ్వర్ రెడ్డి

posted on: Dec 1, 2018 11:07AM

 

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొద్ది రోజుల క్రితం టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన సంగతి విదితమే. తాజాగా ఆయన ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో టీఆర్ఎస్ ని వీడటానికి గల కారణాలను వెల్లడించారు. అంతేకాకుండా మరికొంత మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్‌ పార్టీలో సమస్యను చర్చించే అవకాశమే లేదనీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. రెండేళ్లుగా తాను అవమానాలను ఎదుర్కొంటూ పార్టీలో కొనసాగానన్నారు. ఉద్యమంలో ఎవరినైతే ద్రోహులంటూ కేసీఆర్ దూషించారో.. వాళ్లే ఇప్పుడు పార్టీలో కీలకమయ్యారని ఆయన తెలిపారు. ముందస్తు ఎన్నికలు ఎందుకు అవసరమో తమకు తెలియదన్నారు. పార్టీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో.. ఎవరితోనూ చర్చించకుండానే ముందస్తు ఎన్నికల నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకున్నారన్నారు. తన పర్సనాలిటీ ప్రాంతీయ పార్టీలకు సరిపోదన్న విషయం ఇప్పుడు అర్థమవుతోందని ఆయన అన్నారు. పార్లమెంట్‌లో ఒక రాంగ్‌ప్లేస్‌ నుంచి కూర్చున్నానని తనకు అనిపించిందన్నారు. టీఆర్ఎస్‌లో తాను ఎక్కువ కాలం ఉంటే.. అన్నాడీఎంకే నేతల్లా చేతులపై ‘కేసీఆర్.. కేటీఆర్’.. అని రాసుకోవాల్సి వస్తుందేమోనని భయం వేసిందన్నారు. 

టీఆర్ఎస్‌లో చేరడం, ఆ తర్వాత పార్టీని వీడటం.. ఒక గొప్ప గుణపాఠమని విశ్వేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పైసలు పోయాయి.. పరువు పోయిందనీ చాలాసార్లు ఫీలయ్యానన్నారు. ‘టీఆర్ఎస్ పార్టీలో ఉండి నేను ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నా.. రాత్రిళ్లు సరిగా నిద్రపట్టడం లేదు. ఆత్మగౌరవం లేనప్పుడు ఇక ఇక్కడ ఉండి ఏం లాభం..’ అని తనకు అనిపించేదన్నారు. టీఆర్ఎస్‌లో ఎవరు మాట్లాడినా.. ముఖం,నోరు మాత్రమే వాళ్లవాని, మాటలు మాత్రం కేసీఆర్, కేటీఆర్‌లవని విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంపీలమయిన మా కంటే.. మంత్రులే ఎక్కువగా టీఆర్ఎస్‌లో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ‘ఈ ఎన్నికల్లో వందకు వంద శాతం కాంగ్రెస్ గెలుస్తుంది.. టీఆర్ఎస్ గెలిచే అవకాశాలే లేవు. టీఆర్ఎస్‌కు 30 కంటే తక్కువ సీట్లు వస్తాయి..’ అని తన అభిప్రాయం వెల్లడించారు. ఎన్నికల తర్వాత పార్టీ మారేవాళ్లు చాలామంది ఉంటారనీ, కానీ తనకు అంత తెలివి లేక, చేతకాక ముందే పార్టీ మారానని తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...