తెలంగాణా రాష్ట్రమని ఎందుకు అనమంటున్నారు?

 

ఇకపై మీడియాలో తెలంగాణా కు సంబంధించి వార్తలు ప్రచురించేటప్పుడు, ప్రసారం చేసేటప్పుడు ‘తెలంగాణా’ అనే పదానికి బదులుగా ‘తెలంగాణా రాష్ట్రం’ అని పేర్కొనవలసిందిగా తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నుండి మీడియాకు లేఖలు అందినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి జూన్ 2న ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలుగా విడిపోయిన సంగతి ప్రజలందరికీ తెలుసు. అయితే దేశంలో 29వ రాష్ట్రంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రం గురించి నేటికీ దేశంలో చాలా మందికి తెలిసిఉండకపోవచ్చును. కనుక మీడియాలో కేవలం తెలంగాణా అని పేర్కొనడం వలన అటువంటివారు అదొక కొత్తగా ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రమని తెలుసుకోలేకపోవచ్చును. నేటికీ ఉత్తరాది ప్రజలలో చాలా మందికి దక్షిణ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలియదంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వారిలో చాలా మంది కేవలం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మూడు ప్రధాన నగరాలను తప్ప దక్షిణాది రాష్ట్రాల పేర్లు కానీ అక్కడ ప్రజలు మాట్లాడే బాషలు గురించి కానీ అవగాహన లేదు. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నమ్మక తప్పని నిజం. అటువంటప్పుడు ఒకే బాష మాట్లాడే ఆంధ్ర, తెలంగాణాలను వారు ప్రత్యేక రాష్ట్రాలుగా గుర్తించగలరని ఆశించలేము. బహుశః ఆ కారణంగానే తెలంగాణా రాష్ట్ర ఉనికిని చాటేందుకు ‘తెలంగాణా రాష్ట్రం’ అని పెర్కొనవలసిందిగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కోరి ఉండవచ్చును. అలా కోరడంలో తప్పు పట్టేందుకు ఏమీ లేదు కూడా.