వైద్యుల నిర్లక్ష్యంతో ఆరు నెలల శిశువు మృతి
posted on: Feb 21, 2026 8:15PM

ఓ దంపతులకు జన్మించిన మగబిడ్డతో ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ చిన్నారి జీవితంలో ఆరు నెలలు ఎలా గడిచాయో తెలియలేదు. కానీ గడువు ముగిసిన మందు కారణంగా ఆ శిశువు మృతి చెందాడంతో ఆ కుటుంబంలో చీకట్లు కమ్ముకున్నాయి. రాజేంద్రనగర్లో నివాసం ఉంటున్న దంపతులకు జన్మించిన బిడ్డకు కుటుంబ సభ్యులు రాము అని పేరు పెట్టారు. ఇటీవల ఆరు నెలల రాముకు అకస్మాత్తుగా జ్వరం రావడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు సన్సిటీ పరిధిలోని క్రియాన్స్ హాస్పిటల్కు తరలించారు.
అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఏమి జరిగిందో తెలియకముందే, రాము మృతి చెందినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, గడువు ముగిసిన (ఎక్స్పైరీ) మందు ఇవ్వడం వల్లే తమ బిడ్డ మృతి చెందాడని ఆరోపిస్తున్నారు. మందు ఇచ్చిన కొద్దిసేపటికే బాలుడి ఆరోగ్యం విషమించిందని వారు తెలిపారు. బాధిత కుటుంబం ఆసుపత్రి ముందు నిరసన చేపట్టి, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. స్థానికులు కూడా ఘటనపై స్పందించి, ఆసుపత్రి నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు అక్కడికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను శాంతింపజేశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.







