చప్ప చప్పగా సాగిన బడ్జట్!
posted on: Feb 25, 2016 1:42PM

2015-16కి సంబంధించిన రైల్వే బడ్జట్ నుంచి పెద్దగా ఏమీ ఆశించవద్దంటూ సురేష్ ప్రభు ఎప్పటి నుంచో మొత్తుకుంటూనే ఉన్నారు. కానీ బడ్జట్ అంచనాలను మించి నిరాశపరిచిందంటూ అన్ని ప్రతిపక్షాలూ విరుచుకుపడుతున్నాయి. అటు నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు కానీ ఇటు అభివృద్ధి దిశగా దూసుకుపోతున్న తెలంగాణకు కానీ బడ్జెట్ పెద్దగా ఏవీ వరాలను అందించలేదు. విజయవాడ- నాగ్పూర్ ట్రేడ్కారిడార్, తెలంగాణ సర్కారుతో కలిసి ఎంఎంటీఎస్ అభివృద్ది వంటి మెరుపులు మినహా బడ్జెట్ అంతా చప్పగా సాగిపోయింది.
ప్రయాణికులకు ఎఫ్.ఎం రేడియోలో సంగీతాన్ని వినిపిస్తాం, యువతకు వై-ఫై సౌకర్యాన్ని కల్పిస్తాం అంటూ రైల్వే మంత్రి చేసిన ప్రకటనలు చెప్పుకోదగిన పరిణామాలేం కాదు. ఇక సమయపాలను మెరుగుపరుస్తాం, పరిశుభ్రతను నెలకొల్పుతాం అంటూ మంత్రిగారు చెప్పినప్పటికీ అదేమీ అంత తేలికైన వ్యవహారం కాదని ప్రయాణికులకు అనుభవమే! పిల్లలకు వేడి పాలు అందిస్తాం, కావల్సిన భోజనాన్ని తినిపిస్తాం అంటూ మంత్రిగారు నోరూరించినా మన రైల్వే క్యాటరింగ్ వ్యవస్థని చూసినవారు అవెంత నాణ్యతగా ఉంటాయో ఊహించగలరు. వెరసి ఇప్పటికిప్పుడు ప్రయాణికులకు నిజంగా ఉపయోగపడే కార్యక్రమం ఏదీ బడ్జెట్లో లేకపోయింది. దాంతో తెలుగుదేశం వంటి మిత్రపక్షాలు సైతం బడ్జెట్ని చూసి పెదవి విరుస్తున్నాయి. ఈ బడ్జెట్ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టకుని రూపకల్పన చేసింది అనుకుని ఎవరికి వారు ఓదార్చుకోవడమే మిగిలింది!



.jpg)



