TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఒకే వ్యక్తి నాలుగు చోట్ల ఓట్లు వేశాడు..రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Published on: Thu Aug 7, 2025 4:52PM

 

నకిలీ ఓటర్ల జాబితాలతో  ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓట్‌ చోరీ పేరిట నేడు ఢిల్లీ ఇందిరా భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్‌  మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ కోసం ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ సుదీర్ఘంగా ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్‌లో అగ్రనేత కీలక వ్యాఖ్యలు చేశారు. గురుక్రీత్ సింగ్ అనే వ్యక్తి పేరు కర్ణాటక ఓటర్ల లిస్టులో 4 సార్లు వచ్చింది. ఓకే నియోజకవర్గంలో 4 పోలింగ్ కేంద్రాల్లో అతను ఓటేశారు. సేమ్ పేరు, అడ్రస్‌తోనే అంతా జరిగింది. 

ఇలాంటి ఘటనలు వేలల్లో ఉన్నాయి. కొందరి పేర్లు యూపీ, కర్నాటక, మహారాష్ట్ర పలు రాష్ట్రాల్లో ఉన్నాయి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైనా అనుమానాలున్నాయని రాహుల్ ఆరోపించారు. ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్‌కు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలపై పరిశోధన చేసినట్లు వివరించారు. పరిశోధనలో తమ అనుమానాలు నిజమయ్యాయని చెప్పుకొచ్చారు. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ అనుమానాలకు తావిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ మేరకు బెంగళూరు సెంట్రల్‌ మహదేవ్‌పూర్‌ అసెంబ్లీ స్థానంలో సుమారు లక్షకు పైగా నకిలీ ఓట్లు ఉన్నాయని ఆరోపణలు చేశారు. దాన్ని రుజువు చేసేందుకు తమ వద్ద అణు బాంబు లాంటి ఆధారాలున్నాయని ప్రకటించారు.  మరోవైపు రాహుల్ వ్యాఖ్యలపై కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ స్పందించారు. ఫేక్ ఓట్లపై డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. లేదంటే ఆరోపణలు ఉపసంహరించుకోవాలని రాహుల్ గాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.