వయనాడ్ లో దూసుకుపోతున్న ప్రియాంక
Published on: Sat Nov 23, 2024 9:50AM

ఇక వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ కూడా కొనసాగుతోంది. వీటిలో ప్రధానంగా కేరళలోని వయనాడ్ లోక్ సభ నియోజకవర్గ ఫలితంపై సర్వత్రా ఆసక్తి ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఆ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ పోటీలో ఉన్నారు.
ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయడం ఇదే తొలిసారి. ఈ ఉప ఎన్నిక కౌంటింగ్ లో తొలి నుంచీ ప్రియాంక గాంధీ స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తున్నారు. ఓట్ల లెక్కింపు మొదలైన తొలి గంటలోనే ప్రియాంక గాంధీ దాదాపు పాతిక ఓట్లకు పైగా ఆధిక్యత సాధించారు. వయనాడ్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 16 మంది ఉండగా ప్రధాన పోటీ మాత్రం ప్రియాంకగాంధీ, సీపీఐ సీనియర్ నేత సత్యన్ మెకేరీ, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ మధ్యే ఉంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో వయనాడ్ తో పాటు రాయబరేలీ నుంచి కూడా పోటీ చేశారు. ఈ రెండు స్థానాల నుంచీ ఆయన విజయం సాధించారు. ఆ తరువాత ఆయన వయనాడ్ స్థానానికి రాజీనామా చేసి రాయబరేలి ఎంపీగా కొనసాగుతున్నారు. దీంతో వయనాడ్ కు ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో వయనాడ్ స్థానం నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి దిగారు.


