పవన్‌కు గుడ్ ‌న్యూస్..రాజకీయ పార్టీలకు బ్యాడ్ న్యూస్

పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు గుడ్‌న్యూస్. ఆయన స్థాపించిన "జనసేన" కు రాజకీయపార్టీ హోదా దక్కింది. ఇప్పటికే తెలంగాణలో "జనసేన"కు రాజకీయపార్టీగా గుర్తింపు లభించగా, తాజాగా ఏపీలోనూ ఆ పార్టీకి పొలిటికల్ పార్టీ హోదా దక్కింది. ఈ మేరకు నిన్న ఏపీ ఎన్నికల సంఘం..జనసేనను రాజకీయ పార్టీగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ అధినేత పవన్‌కు గుర్తింపుకు సంబంధించిన పత్రాలు చేరాయి. ఆయనతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల సంఘం ఈ పత్రాలను పంపింది. ఇకపై "జనసేన"ను రాజకీయ పార్టీగా పరిగణించాలని ఆ పత్రాల్లో సూచించింది. దీంతో పార్టీ రిజిస్ట్రేషన్ దాదాపుగా పూర్తయినట్లే. అయితే రాజకీయ పార్టీగా గుర్తించినప్పటికి..ఇంకా పార్టీకి గుర్తును మాత్రం ఎన్నికల సంఘం కేటాయించలేదు. అయితే గుర్తు కేటాయింపులో స్వతంత్ర అభ్యర్థుల కంటే జనసేనకు ప్రాధాన్యమిస్తామని ప్రకటించింది. ఈ వార్తతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటుండగా..మిగతా పార్టీలు మాత్రం బరిలోకి మరో కొత్త పార్టీ వచ్చిందని ఫీలవుతున్నారు.