మంత్రుల కార్యక్రమంలో జేబుదొంగల చేతివాటం..!

ఒకవైపు రాష్ట్ర మంత్రులు..కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు..పోలీస్ పహారా ఇలాంటి చోట దొంగతనం చేయడానికి ఎవరైనా ట్రై చేస్తారా? ఒకవేళ ట్రై చేసినా బయటకు తిరిగివస్తారా? కాని ఇది జరిగింది. నల్గొండ జిల్లా హాలియా మండలం తిరుమలగిరిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పాల్గొన్నారు. భూమిపూజ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమయంలో దొంగలు చేతివాటం చూపించారు. కార్యక్రమానికి హాజరైన వారి జేబులు కత్తిరించి రూ.18,700 వరకు కాజేశారు. బాధితుల్లో గ్రామ వీఆర్ఏ కూడా ఉన్నారు. ఫిర్యాదును అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.