Latest News

జనం మరిచిపోతారన్న భయంతోనే పేర్ని ప్రేలాపనలు!

posted on: Jun 21, 2022 11:34AM

పేర్ని నాని జగన్ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురి కాక ముందు వరకూ ఆయన మీడియా ముందు రాని రోజు ఉండేదంటే అతిశయోక్తి కాదు. నిత్యం విపక్ష తెలుగుదేశంపై విమర్శలు గుప్పించడంలోనూ, పవన్ కల్యాణ్ పై సెటైర్లు వేయడంలోనే ఆయన అందరి కంటే ముందుండే వారు. మంత్రి పదవి పోయిన తరువాత అలకో, ఉక్రోషమో, నిరాశో, నిర్వేదమో తెలియదు కానీ.. పలుకే బంగారమన్నట్లుగా మారిపోయారు. దానికి తోడు మచిలీపట్నం నియోజకవర్గంలో ఎంపీతో వర్గ పోరు. ఇక పేర్ని పనైపోయిందన్న గుసగుసలూ వైసీపీలో బాగానే వినిపించాయి.

మౌనంగా ఉంటే కనుమరుగైపోతామని భావించారో ఏమో పేర్కొ ఒక్క సారి గొంతు సవరించుకున్నారు. అలా ఇలా కాదు.. మళ్లీ నెనుకటి పేర్ని కనిపించేలా? ఈ సారి కూడా ఆయన తనకు అచ్చొచ్చినట్లుగా పవన్ కల్యాణ్ లక్ష్యంగా విమర్శలకు పదును పెట్టారు. పనిలో పనిగా తెలుగుదేశంపైనా కొన్ని విమర్శలు విసిరారు అది వేరే సంగతి. అధినేతకు ఏం మాట్లాడితే నచ్చుతుందో బాగా తెలిసిన వైసీపీ నేతలలో పేర్ని నాని ఒకరు. అందుకే ఆయన చాలా కాలం గ్యాప్ తరువాత మీడియా ముందుకు వచ్చినా ఆయన విమర్శలలో వెనుకటి పదును తగ్గలేదనిపించేలా మాట్లాడారు. ఎంపీ వల్లభనేని బాలశౌరితో విభేదాల కారణంగా పార్టీలో గుర్పింపునకు ముప్పు వచ్చిందన్న అదురో, బెదురో తెలియదు కానీ తాజా ప్రెస్ మీట్ లో ఆయన విపక్షాలపై విమర్శలతో చెలరేగిపోయారు.

బలవన్మరణానికి పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున చెక్కులంటూ జనసేనాని రాజకీయం చేస్తున్నారన్నారు. రైతుకు జగన్ చేస్తున్న సహాయంతో, మేలుతో పోలిస్తే జనసేనాని చేస్తున్నది ఏ పాటి అంటూ చెరిగి పారేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలూ అన్నదాతను అదుకునే విషయంలో జగన్ ను ఫాలో అవుతున్నారంటూ గత కొంత కాలంగా ఆయన పూర్తిగా మరచిపోయిన అధినేత భజనను ఈ మీడియా సమావేశంతో మరో సారి మొదలెట్టేశారు. అంతే కాదు ఒంటరి పోరుకు సిద్ధపడాల్సిందిగా జనసేనానిని రెచ్చగొట్టేందుకే తన వాగ్ధాటిని ఉపయోగించారు. పనిలో పనిగా చంద్రబాబు హయాంలో రైతులకు పంటనష్టపరిహారం చెల్లించలేదన్న ఆరోపణలను మళ్లీ తెరపైకి తీసుకువచ్చి ముందు వాటిని ప్రశ్నించమని పవర్ స్టార్ కు సూచించారు.

అంతే కాకుండా రైతుల కోసం జగన్ అండగా నిలబడ్డారని కితాబిచ్చేశారు. రైతుకు అండగా జగన్ నిలబడినట్లు గతంలో చంద్రబాబు ప్రభుత్వం కానీ, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కానీ నిలబడ్డాయా అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ దృష్టిలో ప్రశ్నించడమంటే జగన్ ను విమర్శించడమేనని నిష్ఠూరమాడారు.   మాట మీద నిలబడటం జనసేన హిస్టరీలోనే లేదన్న పేర్ని నాని 2014లో పార్టీ పెట్టి చంద్రబాబుకు ఓటేయమన్న పవన్ కల్యాణ్, 2019లో చంద్రబాబు వ్యతిరేక ఓటు చీలకుంటే జగన్ కు మేలు జరుగుతుంది కనుకనే ఎన్నికల్లో నిలబడుతున్నామని చెప్పుకున్నారు.

ఇప్పుడేమో జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదు కనుక తెలుగుదేశంతో కలుస్తానంటున్నారు. అంటూ ఎద్దేవా చేశారు.  ఎన్ని చేసినా పేర్ని గారికి వైసీపీలో గతంలోలా ప్రాధాన్యత లభిస్తుందా అంటే పార్టీ వర్గాలే పెదవి విరుస్తున్నాయి. పూర్తాగా కనుమరుగైపోతానన్న భయంతోనే పేర్ని మీడియా ముందు విపక్షాలపై విరుచుకుపడుతున్నారని, ఆయన ఇప్పుడు కొత్తగా చెప్పిందేమీ లేదనీ పరిశీలకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...