పంజాబ్‌ ఘటనపై పవన్ రియాక్షన్.. జనసేనాని ఏమన్నారంటే...

posted on: Jan 7, 2022 4:44PM

పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి ఎదురైన సంఘటన దురదృష్టకరమైనదని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రధాని ప్రయాణంలో 20 నిమిషాలు ముందుకు వెళ్లలేక రహదారిపైనే ఆయన కారు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడడం అవాంఛనీయమని ఆయన అభివర్ణించారు. ప్రజాస్వామ్య దేశంలో నిరసన వ్యక్తం చేయడం ప్రజల హక్కే అయినప్పటికీ ప్రధాని భద్రతకు ఇబ్బంది కలిగేలా నిరసన ఉండకూడదని పవన్ కల్యాణ్ అన్నారు.  

ఎటువంటి పరిస్థితుల్లో ప్రధాని గౌరవానికి భంగం కలిగించేలా ఏ పార్టీ, ఏ ప్రభుత్వం, ఎవరైనా ప్రవర్తించకూడదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రధాని గౌరవించడం అంటే మన జాతిని, మన దేశాన్ని గౌరవించుకోవడమే అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అయితే పంజాబ్‌లో చోటు చేసుకున్న సంఘటన కావాలని చేసిందని తాను భావించడం లేదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కానీ ప్రధాని ఇతర రాష్ట్రాల్లో పర్యటించేటప్పుడు ప్రోటోకాల్స్‌ తు.చ. తప్పకుండా పాటించవలసిన బాధ్యత ఆయా రాష్ట్రాలపైనే ఉంటుందని.. ఈ విషయం అందరికీ తెలిసిందేనని పవన్ కల్యాణ్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. 

మరోసారి ఇలా దేశ ప్రధానికి కానీ.. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారెవరికీ ఇటువంటి పరిస్థితి ఎదురు కాకూడదని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో సంయమనం పాటించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా పవన్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ పేరిట జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...