నాగబాబుపై పవన్ కల్యాణ్ ఫైర్.. ఎందుకంటే?
posted on: Feb 3, 2026 2:03PM

ఆంధ్రప్రదేశ్ లో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం చుట్టూ రాజకీయం వేడెక్కుతోంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ సుప్రీంలో చార్జిషీట్ దాఖలు చేసిన క్షణం నుంచీ ఏపీ రాజకీయం రగులుతోంది. చార్జిషీట్ లో నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ నిర్ధారించిందని వైసీపీ అంటుంటే.. తెలుగుదేశం సిట్ చార్జిషీట్ అసలది నెయ్యే కాదని తేల్చిందని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ తన విమర్శల దాడి పెంచి.. అధికార కూటమిని రెచ్చగొట్టి లబ్థి పొందాలని చూస్తోంది. అందులో భాగంగానే.. నెయ్యి కల్తీ వ్యవహారంలో దూకుడుగా విమర్శలు చేసిన పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసుకుని వైసీపీ విరుచుకుపడుతోంది. పాప ప్రక్షాలన, పరిహారం అంటూ ఆలయాల శుద్ధి కార్యక్రమం చేపట్టింది.
ఈ నేపథ్యంలోనే జనసేనాని సోమవారం (ఫిబ్రవరి 1) పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పవన్ కల్యాణ్ ఒకింత అసహనం, మరింత ఆవేశం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మూడు పార్టీల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటూ.. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో ప్రభుత్వ గళాన్ని వినిపిం చడంలో జనసేన నేతలు ఉదాశీనంగా వ్యవహరించడంపై మండి పడ్డారు. ఎవరి పేరూ ఎత్తకపోయినా, ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఆయన తన సోదరుడు నాగబాబుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని అర్ధమౌతోంని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గర రెండేళ్లు కావస్తున్నది. ఈ రెండేళ్ల కాలంలోనూ ప్రభుత్వ పరంగా ఎలాంటి అరమరికలూ లేకుండా మూడు పార్టీల నేతల మధ్యా సమన్వయం ఉందన్న విషయం అవగతమౌతున్నది. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం మూడు పార్టీలూ కూడా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలోపెద్దగా సొంత బలం లేని బీజేపీని పక్కన పెడితే.. ప్రధానంగా తెలుగుదేశం, జనసేనల మధ్య క్షేత్రస్థాయిలో అంతగా సమన్వయం కనిపించడం లేదు. ఆ విషయం తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ కేసుకు సంబంధించి వైసీపీ విమర్శలకు దీటుగా బదులిచ్చే విషయంలో ప్రస్ఫుటంగా బహిర్గతమైంది. అంతకు ముందు కూడా పిఠాపురం వర్మ వ్యవహారంలోనూ తెలుగుదేశం, జనసేనల మధ్య విభేదాలు, సమన్వయ లేమి బయటపడింది. అప్పట్లో అంటే వర్మ వ్యవహారంలో ఇరు పార్టీల మధ్యా పొరపొచ్చాలకు పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు తీరు కారణమన్న విమర్శలు వినవచ్చాయి.
ఇక ప్రస్తుతానికి వస్తే.. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి వైసీపీ వ్యాఖ్యలు, విమర్శలకు సమాధానం చెప్పుకోవలసింది తెలుగుదేశం పార్టీయే అన్నట్లుగా జనసేన నేతలు వ్యవహరిస్తూ వచ్చారు. ఒక్క పవన్ కల్యాణ్ వినా మరెవరూ ఈ విషయంలో మాట్లాడకపోవడంతో పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మూడు పార్టీల కూటమి ప్రభుత్వం నడుస్తోంది. ఏ విషయంలోనైనా సరే మూడు పార్టీల గొంతూ ఒక్కటిగానే ఉండాలని పార్టీ నేతలు, కార్యకర్తలు, మంత్రులు, ఎంపీలకు విస్పష్టంగా చెప్పారు. ఆ సమయంలోనే ఆయన ఆడవారి దుస్తుల వ్యవహారంలో మాట్లాడడానికి కావలసినంత సమయం ఉంటుంది కానీ, పార్టీ, ప్రభుత్వానికి సంబంధించిన విషయాలపై స్పందించడానికి తీరిక ఉండదా? అని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. సరిగ్గా ఇదే ఆయన ఆగ్రహం నాగబాబుపైనా అన్నచర్చకు తెర లేచింది.
తిరుమలలడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో కల్తీ వివాదం ఇప్పుడు పీక్స్ కు చేరుకుంది. ఈ విషయంపై నడుస్తున్న రాజకీయ వివాదంపై ప్రభుత్వం వాయిస్ ను జనసేన నాయకులూ వినిపించి తీరాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. కూటమి పరంగా మూడు పార్టీలు అటాక్ చేయాల్సిందేనని కుండబద్దలు కొట్టారు. చూడాలి మరి జనసేనాని ఆదేశాలతోనైనా జనసేన నేతలు తమ వాణిని బలంగా వినిపిస్తారేమో.



.webp)
.webp)
.webp)
.webp)



