వైజాగ్ లో హైడ్రామా.. ఒక్కొక్కరికి రూ. 500.. పసుపు చీరలు!!

విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌ని వైసీపీ శ్రేణులు అడుగడుగునా అడ్డుకున్నారు. చంద్రబాబు వెహికిల్ ని కదలనివ్వకుండా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు కాన్వాయ్‌ను వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబును చూసి భయపడుతున్నారని.. మంత్రి బొత్సకు చెమటలు పడుతున్నాయని, అవంతికి కాళ్లు, చేతులు ఆడడంలేదని.. అందుకే చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకున్నారని మండిపడ్డారు. ఇలా ఎన్ని రోజులు ఆపుతారని అనురాధ ప్రశ్నించారు. అప్పుడు వైఎస్ జగన్ పాదయాత్రను అడ్డుకుని ఉంటే వైసీపీ వాళ్లంతా ఎక్కడుండేవాళ్లని నిలదీశారు. చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న వాళ్లంతా పెయిడ్ ఆర్టిస్టులని, ఒక్కొక్కరికి రూ. 500 ఇచ్చి వైసీపీ నేతలు తీసుకువచ్చారని ఆరోపించారు. వైసీపీవాళ్లకు దమ్ములేదని, మహిళలకు పసుపు రంగు చీరలు కట్టించి తీసుకువచ్చారని అనురాధ ఆరోపించారు.