కోల్కతా వన్డేలో పాకిస్తాన్ 250 ఆలౌట్
posted on Jan 3, 2013 3:03PM
కోల్కతా లో జరుగుతున్న రెండో వన్డేలో పాకిస్తాన్ 250 పరుగులకు ఆలౌటైంది. స్కోరు బోర్డు వేగం పెంచే క్రమంలో పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ లు ఒకరి వెనుక ఒకరు పెవిలియన్ కి క్యూ కట్టారు. ఒక దశలో 300 పైగా స్కోరు పాకిస్తాన్ చేస్తుందని అనుకున్నారు. కాని రవీంద్ర జడేజా మూడు ముఖ్యమైన వికెట్లు తీసి పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ ను దెబ్బ తీశాడు. రవీంద్ర జడేజా కు ఇషాంత్ శర్మ సూపర్ బౌలింగ్ తోడవడంతో పాకిస్తాన్ను 250 పరుగులకు భారత్ కట్టడి చేసింది. పూర్తి ఓవర్లను కూడా పాకిస్తాన్ ఆడలేకపోయింది. 48.3 ఓవర్లు మాత్రమే ఆడింది.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఓపెనర్ మొహమ్మద్ హఫీజ్ను 76 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా అవుట్ చేయడంతో ప్రారంభమైన వికెట్ల పతనం చివరి వరకు కొనసాగుతూ వచ్చింది. ఓ వైపు వికెట్లు పడిపోతుంటే జంషెడ్ గట్టిగా నిలబడి సెంచరీ చేశాడు. 124 బంతుల్లో 106 పరుగులు చేసి అతను జడేజా బౌలింగులో అవుటయ్యాడు. ఆ వెంటనే కమ్రాన్ అక్మల్ జడేజా చేతిలోనే డకౌట్ అయ్యాడు. పాకిస్తాన్ 34.3 ఓవర్లలో 177 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయి పటిష్టమైన స్థితిలో ఉన్న పాకిస్తాన్ భారత బౌలర్ల ధాటికి కుప్పకూలింది.