హైకోర్టు తరలింపుపై పూర్తి స్థాయి ప్రతిపాదనలు లేవు.. లోక్ సభలో కేంద్ర మంత్రి రిజుజు
Published on: Sat Jul 23, 2022 8:03AM
అమరావతిని నిర్వీర్యం చేయడమన్నలక్ష్యం తప్పితే మూడు రాజధానులపై జగన్ కు నిజంగా సీరియస్ నేస్ లేదని మరో సారి తేలిపోయింది. రాష్ట్రానికి రాజధాని లేకపోయినా ఫర్వాలేదు కానీ.. చంద్రబాబు ఆరంభించిన అమరావతి మాత్రం ముందుకు కదలకూడదు అన్నదే జగన్ ఏకైక లక్ష్యం అనడానికి లోక్ సభ సాక్షిగా రుజువు దొరికింది.
స్వయంగా వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రిజుజు ఇచ్చిన సమాధానమే మూడు రాజధానులపై జగన్ చిత్తశుద్ధిలోని డొల్లతనం బయట పడింది. హైకోర్టు ధర్మాసనాన్ని కర్నూలుకు తరలించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాత పూర్వక విజ్ణప్తి వచ్చిందా? కేంద్రం ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అంటూ లోక్ సభలో వైసీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, చింతా అనూరాధ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
అమరావతి నుంచి ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలించాలన్న ప్రతిపాదన సీఎం జగన్ నుంచి 2020 ఫిబ్రవరిలో ఒక ప్రతిపాదన వచ్చిందన్న రిజుజు పూర్తి స్థాయి ప్రతిపాదనలు మాత్రం అందలేదన్నారు.హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఒక అభిప్రాయానికి వచ్చి పూర్తి స్థాయి ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకూ అటువంటి పూర్తి స్థాయి ప్రతిపాదన ఏదీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదని ఆయన తన సమాధానంలో స్పష్టం చేశారు. రూ.1137.92 కోట్లు విడుదల చేశామన్నారు.


