పోలవరం ప్రాజెక్ట్ చివరిది..!!

posted on: Aug 10, 2018 10:31AM

 

పోలవరం ప్రాజెక్ట్ కు జాతీయహోదా కల్పించిన విషయం తెలిసిందే.. అయితే ఇకమీదట వేరే ఏ ప్రాజెక్ట్ కు జాతీయహోదా కల్పించేది లేదని కేంద్రం స్పష్టం చేసింది.. తాజాగా కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ.. 'ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడేటప్పుడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులో పోలవరానికి జాతీయ హోదా కల్పించారు.. అందుకే దాన్ని జాతీయ ప్రాజెక్టుగా తీసుకొని మేం పనిచేస్తున్నాం.. దాని తర్వాత ఇక ఏ ప్రాజెక్టునూ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.. కొండప్రాంతాలు, ఈశాన్యరాష్ట్రాల్లో చేపట్టే ప్రాజెక్టులకు 90% కేంద్రం, 10% రాష్ట్రం నిధులు అందిస్తాయి.. కరువుపీడిత ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులు సమకూరుస్తాయి.. రాజ్యాంగం ప్రకారం సాగునీటి బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుంది.. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే విధానం ఇప్పుడు లేదు.. ఒకవేళ రాష్ట్రాలు ఏవైనా ప్రాజెక్టులు చేయాలనుకుంటే ఈ నిష్పత్తి కిందికే వస్తాయి.. ఇకమీదట జాతీయ ప్రాజెక్టులుగా దేన్నీ ప్రకటించం’’ అని అన్నారు.

 

 

మరోవైపు ఈ విషయంపై తెరాస ఎంపీ వినోద్‌కుమార్‌ గడ్కరీకి లేఖ రాసారు.. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారమే తెలంగాణ ఏర్పడినందున ఆ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు కేంద్రం ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.. కాళేశ్వరం కానీ పాలమూరు ఎత్తిపోతల పథకాన్నికానీ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుతోపాటు ఎంపీలంతా గత కొన్నేళ్లుగా నిరంతరం విజ్ఞప్తిచేస్తూ వస్తున్నామని పేర్కొన్నారు.. కేంద్రం తగిన నిధులు కేటాయించకపోయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కృష్ణా, గోదావరిలపై  సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించిందని, అందులో కనీసం ఒక్కప్రాజెక్టునైనా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కోరారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...