ఆజాద్ కు టీ-కాంగ్రెస్ ఎంపీల హెచ్చరిక

posted on: Mar 28, 2012 10:15AM

న్యూఢిల్లీ: లోక్ సభ సజావుగా సాగడానికి సహకరించాలని తమ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ చేసిన సూచనను తాము తిరస్కరించామని, ఇక ముందు కూడా తిరస్కరిస్తామని, తెలంగాణపై స్పష్టమైన హామీ వచ్చే వరకు లోక్ సభ సమావేశాలను అడ్డుకుంటామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు చెప్పారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని బలరాం నాయక్ విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యలు దురదృష్టకరమైన పరిణామమని సిరిసిల్ల రాజయ్య అన్నారు. తాము ఆజాద్ మాట వినకుండా లోక్ సభను స్తంభింపజేశామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సమైక్యవాదులు అడ్డుపడవద్దని, అలా అడ్డుపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన అన్నారు. తెలంగాణను సాధించే వరకు పోరాటం చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు వద్దని, పోరాడి తెలంగాణను సాధించుకుందామని ఆయన యువతకు పిలుపునిచ్చారు.

రేపు మరోసారి తమతో మాట్లాడుతామని ఆజాద్ చెప్పారని రాజయ్య అన్నారు. అన్ని జిల్లాల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గ్రూపులు, సబ్ గ్రూపులు ఏర్పాటు చేసి కాంగ్రెసు పార్టీని బలహీనపరుస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ అంశం మరుగునపడిందని, రెండు సీట్లు గెలుస్తామని ముఖ్యమంత్రి చెప్పారని, కానీ అలా జరగలేదని ఆయన అన్నారు. తెలంగాణపై వాయిదాలు పెడుతున్నారని, వాయిదాలు పెడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం లేదని, దీంతో కాంగ్రెసుపై నమ్మకం సన్నగిల్లుతోందని, అందుకే ఆరు స్థానాల్లో కూడా కాంగ్రెసు ఓడిపోయిందని మందా జగన్నాథం అన్నారు. తెలంగాణపై తేల్చే వరకు పార్లమెంటును స్తంభింపజేస్తామని ఆయన చెప్పారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...