రంగంలోకి దిగుతా..రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలతో అధినేత్రి సోనియా

posted on: Mar 22, 2012 11:49AM

న్యూఢిల్లీ: రాష్ట్రంలోని ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల ఫలితాలపై ఆమె బుధవారం లోక్ సభలో తనను కలిసిన ఎంపీలతో వ్యక్తం చేసిన అభిప్రాయాలే ఇందుకు నిదర్శనం. ఉప ఎన్నికలు జరిగిన ఏడు స్థానాల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఎక్కువ స్థానాల్లో రెండో స్థానం కూడా దక్కించుకోకపోవడంపై ఆమె విస్మయం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు ఫలితంపై కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాస రెడ్డి నివేదిక సమర్పించారు. ఈ ఫలితం ముందుగా ఊహించిందే. కానీ.. దీని ప్రభావం త్వరలో జరగనున్న 18 ఉప ఎన్నికలపై పడకుండా జాగ్రత్త పడాలి. నాకు అర్థమైనంత వరకూ ఏపీలో సీనియర్లతో సమన్వయం సరిగా లేదు. ఇదే ప్రధాన లోపం. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం లేదు. ఇదే పార్టీకి నష్టం చేకూరుస్తోంది. ఇక నేనే రంగంలోకి దిగుతా. సమన్వయం ఉండేలా చూడాల్సిన బాధ్యత స్థానిక నేతలపైనా ఉంది. దీనిపై దృష్టి సారించాలి'' అని ఆమె అన్నట్లు తెలిసింది.

అయితే, ఫలితాలను కాంగ్రెసు జాతీయ నాయకులు తేలికగా కొట్టివేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఫలితాలు ఊహించనవేనని ఎఐసిసి అధికార ప్రతినిధి రషీద్ అల్వీ అన్నారు. పైకి తేలిగ్గా కొట్టి పారేయడానికి ప్రయత్నిస్తున్న లోలోన తీవ్రమైన మథనం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
 
కాగా.. రాజ్యసభ సభ్యత్వాల ఎంపికకు సంబంధించి అధినేత్రితో సీఎం కిరణ్ సమావేశమైనప్పుడు కూడా ఉప ఎన్నికల అంశం చర్చకు వచ్చిందని తెలిసింది. ఈ సమయంలో ఉప ఎన్నికలు జరుగుతున్న ఏడింటిలో ఎన్నింటిలో గెలుస్తామని సీఎంను సోనియా ప్రశ్నించారు. ఇందుకు ఆయన రెండు లేదా మూడింటిలో గెలిచే అవకాశాలున్నాయని అన్నప్పుడు.. కాంగ్రెస్ అభ్యర్థులు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారని అధినేత్రి వ్యాఖ్యానించినట్లు సమాచారం. అనంతరం, త్వరలో జరగనున్న 18 ఉప ఎన్నికల్లో ఎన్నింటిలో గెలుస్తామని సోనియా ప్రశ్నించగా సీఎం మౌనం దాల్చారని పార్టీ వర్గాలు వివరించాయి. దీంతో, ఇలాగైతే ఆ 18 స్థానాల్లోనూ విజయం సాధించడం కష్టమేనని.. పార్టీని విజయపథాన నడిపించాల్సిన బాధ్యతను తీసుకోవాలని సీఎంకు సోనియా సూచించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.


కాగా, తెలంగాణకు చెందిన కాంగ్రెసు నాయకులు ప్రస్తుత ఫలితాల నేపథ్యంలో మరోసారి తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపించేందుకు సమాయత్తమవుతున్నారు. తెలంగాణపై పార్టీ వైఖరిని తప్పు పడుతున్నారు. తెలంగాణ ప్రజలు తమను నమ్మలేదని, తెలంగాణ ఇస్తేనే ప్రజలు నమ్ముతారని రాజ్యసభకు ఎన్నికైన కాంగ్రెసు నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. సీనియర్ కాంగ్రెసు నాయకుడు కె. కేశవరావు కూడా తీవ్రంగా స్పందించారు. కాగా, మహబూబ్ నగర్ విజయంతో బిజెపిలో కొత్త ఉత్సాహం నిండుకున్నట్లు అర్థమవుతోంది. బిజెపి జాతీయ నాయకుడు ఎం వెంకయ్య నాయుడు ఈ ఫలితంపై స్పందించారు. రాష్ట్ర రాజకీయాల్లో మహబూబ్ నగర్ ఫలితం నూతన అధ్యాయానికి నాంది అవుతుందని అన్నారు. తెలంగాణకు అనుకూలంగా తాము తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ఆదరించినట్లు ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. బిజెపితోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ప్రజలు నమ్ముతున్నారని ఆయన అన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...