నేపాల్ భూకంప మృతులు 5,489

 

భూకంప తాకిడికి నేపాల్ ఒక్కసారిగా అతలాకుతలమైపోయింది. రోజులు గడుస్తున్నా పరిస్థితి ఇంకా కొలిక్కిరాకపోగా మృతుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. దాదాపు ఇప్పటివరకు 5,489 మంది మృతిచెందారు. ఇంకా ఎంతో మంది శిథిలాల కింద చిక్కుకొని ఉన్నారు. మరోవైపు ఎన్నో దేశాలు నేపాల్ కు సహాయం చేయడానికి ముందుకొచ్చినా ఆసాయాన్ని సమర్ధవంతంగా అందుకో లేకపోవడమే సమస్యగా మారింది. మరోవైపు దేశాల నుండి వచ్చే సహాయాన్ని అందుకోవడానికి, బాధితులు వద్దకు చేర్చడానికి నేపాల్ ఒకే ఒక విమానాశ్రయం త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంపైనే ఆధారపడింది. ఇప్పటికే విపరీతమైన రద్దీతో ఉన్న విమానాశ్రయం... బాధితులకు నిత్యావసర సరుకులు తీసుకువచ్చే పలు విమానాలు దిగే వీలు లేకుండా పోయింది. దీంతో వాటిని భారత్ కో, మరోవైపుకో మళ్లించడం జరుగుతోంది. పొరుగు దేశాలు సహాయ సామాగ్రిని పంపించినా మౌలిక సౌకర్యాలు, పాలన వనరులు, నైపుణ్యం అంతంత మాత్రంగానే ఉన్న నేపాల్ ప్రభుత్వం సైన్యం వాటిని వినియోగపరుచుకోవడం తలకు మించిన భారమవుతోంది. ఇదిలా ఉండగా దాతలు సహాయం మావద్దకు చేర్చాలంటూ బాధితులు నేపాల్ ప్రధానమంత్రి సుశీల్ కోయిరాలా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.