వారణాసిలో నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు

 

 

 

బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గుజరాత్‌లోని వదోదర, ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గాల నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. వదోదరలో మోడీ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. గురువారం నాడు ఆయన వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. దాదాపు రెండు లక్షలమంది కాషాయదళంతో ప్రదర్శనగా వెళ్ళి మోడీ నామినేషన్ దాఖలు చేశారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడైన మదన్ మోహన్ మాలవ్య మనవడు జస్టిస్ గిరిధర్ మాలవ్య వారణాసి నుంచి నరేంద్ర మోడీ నామినేషన్‌ని బలపరిచారు. వారణాసిలోనే నివసించే షహనాయ్ విద్వాంసుడు బిస్మిల్లాఖాన్ కుటుంబ సభ్యులు కూడా తన నామినేషన్‌ని బలపరిస్తే బాగుంటుందని నరేంద్ర మోడీ భావించారు. అయితే తాము రాజకీయాలకు పూర్తిగా దూరంగా వుండేవారని బిస్మిల్లాఖాన్ చెబుతూ వుండేవారని, అందువల్ల మీ నామినేషన్‌ని మేము బలపరచలేమని బిస్మిల్లాఖాన్ కుటుంబ సభ్యులు చెప్పడంతో మోడీ వారిని ఇబ్బంది పెట్టలేదు.