Latest News

నారాయణ ఫోన్ ట్యాప్ చేశారు.. అసలు విషయం చెప్పేసిన మంత్రి పెద్దిరెడ్డి

posted on: May 11, 2022 11:26AM

టెన్త్ ప్రశ్నా పత్రాల లీక్ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ అరెస్టు, బెయిలు ఎపిసోడ్ ఇంకా ముగిసిపోలేదు. నారాయణకు బెయిలు మంజూరు కావడం, నారాయణపై అభియోగాలను న్యాయమూర్తి తోసిపుచ్చడంతో వైసీపీ ప్లాన్ అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆ అయితే వైసీపీ ప్లాపుల పరంపర ఇదే మొదలూ కాదు, ఇదే చివరిదీ  కాదు అనిపిస్తున్నది. అసలు నారాయణ వేర్ అబౌట్స్ పోలీసులకు ఎలా తెలిశాయి అన్న అనుమానమే ఎవరికీ రాలేదు. కానీ తెలిసో, తెలియకో  మంత్రి పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి, జగన్ ప్రభుత్వానికి మైండ్ బ్లాక్ అయిపోయే వాస్తవాన్ని బయట పెట్టేశారు. మాజీ మంత్రి నారాయణ పోన్ ను ట్యాప్ చేసి ఆయనను పట్టు కోగలిగామని విలేకరుల సమావేశంలో చెప్పారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ ద్వారానే పేపర్ల లీక్ లో బాధ్యులను పోలీసులు అరెస్టు చేశారని మీడియాకు వివరించారు. ఇందుకు సంబంధించి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

 నారాయణను ఫోన్ ట్రాకింగ్ ద్వారా పట్టుకున్నామంటూ పోలీసులు చెప్పారు. అయితే పోలీసుల చెబుతున్నది పూర్తి అవాస్తవమని మంత్రి మాటలు తేల్చేశాయి. పరీక్షా పత్రాల లీకేజికి సంబంధించి తనపై కేసు నమోదైందని తెలియగానే నారాయణ తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారనీ పోలీసులే చెప్పారు. అలాంటప్పుడు నారాయణ ఉపయోగిస్తున్న మరో ఫోన్ నంబర్ వారికి ఎలా తెలిసింది అన్న ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. ఆ ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. నారాయణ ఫోన్ లను ట్యాపింగ్ చేయడం ద్వారా అయన ఎక్కడ ఉన్నారో కనుగొని పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. అంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారానే నారాయణ అనుపానులు కనుగొని పోలీసులు అరెస్టు చేశారని విస్పష్టంగా తేలిపోతోంది. మరి ఫోన్ ట్యాపింగ్ కు అవసరమైన అనుమతులు తీసుకున్నారా? తీసుకుంటే పోలీసులు వెంటనే వాటిని బహిర్గతం చేయాలి. అలాంటి అనుమతులేవీ లేకపోతే.. ఇది అత్యంత తీవ్రమైన నేరం కనుక ట్యాపింగ్ కు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో ఫిర్యాదు అందాల్సిన అవసరం కాదు. స్వయంగా మంత్రి పెద్ది రామచంద్రారెడ్డే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పారు. కోర్టే సుమోటోగా తీసుకుని ఈ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జరిపించాలి. బాధ్యులకు చట్ట ప్రకారం శిక్షపడేలా చేయాలి.

మొత్తం మీద మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని బయటపెట్టి మొత్తం జగన్ సర్కార్ ను బోనులో నిలబెట్టారు. ఫోన్ ట్యాపింగ్ కు బాధ్యులు ఎవరో, దీని వెనుక ఉన్న వారు ఎవరు అన్న విషయం నిష్పాక్షిక విచారణ ద్వారానే వెల్లడౌతుంది. 

నష్ట నివారణకు వైసీపీ కొత్త వాదనను తెరమీదకు తెస్తున్నది. మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ఫోన్ ట్రాకింగ్ అనబోయి పొరపాటున ఫోన్ ట్యాపింగ్ అన్నారన్నది ఆ వాదన. ప్రస్తుతం జగన్ కేబినెట్ లో ఉన్న వారిలో బొత్స తరువాత అత్యంత సీనియర్ అయిన పెద్దరెడ్డి పొరపాటున, అవగాహనా రాహిత్యంతో మాట్లాడారని చెప్పి తప్పించుకోవడం సాధ్యం కాదు. బాధ్యతాయుత పదవుల్లో, హోదాల్లో ఉన్న  వ్యక్తులు అవగాహనా రాహిత్యంతో మాట్లాడారని తప్పించుకోజాలరు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై నిజాలు నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది.  మొత్తం మీద జగన్ సర్కార్ కక్ష సాధింపు చర్య బూమ్ రాంగ్ అయ్యింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జగన్ మెడకే చుట్టుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 

google-ad-img
    Related Sigment News
    • Loading...