TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ద్రోహుల సమాచారంతోనే నంబాల ఎన్ కౌంటర్

Published on: Tue May 27, 2025 6:49AM

మావోయిస్టుల సంచలన లేఖ
పాకిస్థాన్‌తో చర్చలు జరిపినప్పుడు తమతో చర్చలు జరిపితే తప్పేంటని ప్రశ్న 

 మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టులు తొలిసారిగా సంచలన లేఖ విడుదల చేశారు. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారం మేరకే నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ జరిగిందని ఆ లేఖలో పేర్కొన్నారు.   6నెలలుగా మాడ్ ప్రాంతంలోనే నంబాల ఉన్నట్లు ప్రకటించారు. కేశవరావు టీమ్‌లో ఉన్న ఆరుగురు మావోయిస్టులు ఇటీవలే లొంగిపోయారని మావోయిస్టులు లేఖలో తెలిపారు. 

వారు ఇచ్చిన సమాచారంతోనే ఎన్‌కౌంటర్ జరిగిందని చెప్పుకొచ్చారు. కేశవరావును సురక్షిత ప్రాంతానికి తరలిస్తామంటే ఆయన ఒప్పుకోలేదని అన్నారు. కేశవరావు కోసం 35మంది ప్రాణాలు అడ్డుపెడితే ఏడుగురం సురక్షితంగా బయటపడ్డామని తెలిపారు. 27మంది ఎన్ కౌంటర్‌లో చనిపోయారని చెప్పారు. పాకిస్థాన్‌తో చర్చలు జరిపినప్పుడు తమతో చర్చలు జరిపితే తప్పేంటని ప్రశ్నించారు. స్పెషల్ జోనల్ కమిటీ వికల్ప్ పేరుతో ఈ లేఖను మావోయిస్టులు విడుదల చేశారు.

కాగా, మావోయిస్టు చీఫ్ నంబాల కేశవరావు అంత్యక్రియలు  సోమవారం(మే 26) సాయంత్రం పూర్తి అయ్యాయి. మాడ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో నంబర్ల కేశవరావు చనిపోయిన విషయం తెలిసిందే. కేశవరావు మృతదేహాన్ని అప్పగించాలంటూ బలగాలని కుటుంబ సభ్యులు కోరారు. కేశవ్‌రావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా భద్రతా బలగాలే అంత్యక్రియలు పూర్తిచేశాయి. అబూజ్‌మడ్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన నక్సలైట్లకు పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. నాలుగు రోజులుగా మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేసినా ఫలితం లేకపోయింది.