యురేనియం ప్లాంట్ తో కృష్ణాతీరానికి రేడియేషన్ ముప్పు

posted on: Mar 21, 2012 12:58PM

నల్గొండ జిల్లాలో ఏర్పాటుచేయబోతున్న యురేనియం శుద్ధి కర్మాగారంవల్ల కృష్ణా తీరప్రాంత జలాలు రేడియేషన్ ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉందని తెలుస్తోంది. జిల్లాలోని దేవరకొండ మండలం శేరిపల్లి వద్ద 300 ఎకరాల అటవీభూమిలో యురేనియంశుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి తోడు పిసి పల్లి మండలం, నంబాపురం, పెద్దగట్టుల్లో 13 వేల ఎకరాల విస్తీర్ణంలోనూ, అదేవిధంగా చందంపేట మండలం చిత్రియాల, పెద్దమూల, రేగులగడ్డ అటవీప్రాంతాల్లో 2500 ఎకరాల విస్తీర్ణంలోనూ యురేనియం తవ్వకాలను చేపట్టబోతున్నారు.

 

ఇక్కడ యురేనియం నిక్షేపాలను వెలికితీసి శుద్ధిచేయడం వల్ల కృష్ణాజలాలు యురేనియం ధాతువులతో కలిసి కలుషితమయ్యే ప్రమాదం ఉందని మేధావులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం సాగర్ రిజర్వాయర్ నుంచి హైదరాబాద్ జంట నగరాలకు, మరికొంత ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగునీటిని అందిస్తున్నారు. అంతేకాక సాగర్ కుడి, ఎడమ కాల్వల కింద గుంటూరు, ప్రకాశం, నల్లగొండ, ఖమ్మం, కృష్ణాజిల్లాల్లోని తాగునీటి ప్రాజెక్టులకు సైతం సాగర్ రిజర్వాయర్ నీరే ఆధారం. ఈ నీరు కలుషితమైతే లక్షలాది మంది ప్రజల ఆరోగ్యాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముంది. అందువల్ల యురేనియం తవ్వకాలను, యురేనియం శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటుచేసే యోచనను మానుకోవాలని స్థానిక ప్రజలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...