కల్తీసారా మృతులు 102 మంది
Published on: Tue Jun 23, 2015 4:46PM

ముంబైలోని మలద్లో కల్తీసారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య 102కి చేరింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించింది. మంత్రివర్గ సమావేశం అనంతరం ఎక్సైజ్ శాఖ మంత్రి ఏకనాథ్ ఖడ్సే విలేకరులకు ఈ విషయాన్ని తెలిపారు. ప్రధాన కార్యదర్శి మూడు నెలలో ఈ ఘటనపై తన నివేదికను ఇస్తారు. కల్తీ సారా కారణంగా ముంబై మహానగరంలో ఇంత భారీ సంఖ్యలో మరణాలు సంభవించడంతో ముంబైలో సారా అమ్మకాల మీద ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించింది. ఇకపై ముంబైలోని మురికివాడల్లో కల్తీసారా అమ్మకుండా తగిన చర్యలు చేపట్టనున్నామని ఖడ్సే తెలిపారు. ఈ ఘటనతో సంబంధం వున్న ఏడుగురు వ్యక్తులను ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఎనిమిది మంది పోలీసులు, నలుగురు ఎక్సైజ్ అధికారులను సస్సెండ్ చేశారు.


