10 వేల మందితో పులివెందులలో సభ పెట్టే దమ్ముంది నాకు.. రఘురామరాజు

వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు తన తోటి వైసిపి ఎంపీలపై మరోసారి ఫైర్ అయ్యారు. తన తోలు తీస్తామంటూ నిన్న వైసీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై రఘురామ రాజు తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు. తన ఒంటిపై చేయి పడితే తనను కాపాడేందుకు హేమాహేమీలు ఉన్నారని... ఆకు రౌడీలు ఏదో చేస్తారని భయపడే స్థితిలో తాను లేనని ఆయన స్పష్టం చేసారు. న్యాయవ్యవస్థలను భ్రష్టుపట్టించడమే లక్ష్యంగా తమ పార్టీ వైసిపి పనిచేస్తోందని అయన వ్యాఖ్యానించారు. తనను అనర్హుడిగా ప్రకటించడమే లక్ష్యంగా పార్టీ నాయకులు పెట్టుకున్నారన్నారు. అయితే తనను బహిష్కరించే దమ్ము వారికి లేదన్నారు.

 

ఎంపీ రఘురామకృష్ణం రాజు మీడియాతో మాట్లాడుతూ ‘‘తోలు తీయడం నా వృత్తి కాదండి. వారు బహుభాషా కోవిదులు. అలా మాట్లాడటం కాస్తో కూస్తో వచ్చినా... నాలో నేను మాట్లాడతాను కానీ.. ప్రజలు అసహ్యించుకొని.. ఉమ్మేసేలా మాట్లాడటం నాకు చేతకాదు. దానికి నేనేమీ చేయలేను. సంస్కార వంతులు.. సంస్కారాన్ని గౌరవించే వాళ్లు, విజ్ఞులు అయిన వాళ్లు 90శాతం మంది ఉన్నారు. అయితే ఇలాంటి తోలు తీసే చేష్టలకు, తగిన సమాధానం చెప్పే స్నేహితులు కూడా నాకున్నారు. ఎంపీ రాజా భయ్యా.. నాకు మంచి స్నేహితుడు. అయన అసలు పేరు రఘు రాజ్ ప్రతాప్. రాజా భయ్యా మాత్రమే కాదు.. నన్ను కంటికి రెప్పలా కాపాడేవాళ్లు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. నా ఒంటిపై చిన్న చేయి పడితే.. దానికి స్పందించి.. నన్ను కాపాడగలిగే వ్యక్తులు, స్నేహితులు అటు రాయలసీమలో కూడా ఉన్నారు. పులివెందులలో కూడా నా స్నేహితులు ఉన్నారు. పదివేల మందితో పులివెందులలో సభ పెట్టగల కెపాసిటీ నాకు ఉంది. అయితే ఈ విషయాలన్నీ కరోనా తగ్గిన తర్వాత చూద్దాం. న్యాయస్థానాల్లో నాకు న్యాయం జరుగుతుంది’’ అని అయన తెలిపారు.