అజిత్ పవార్ మృతి పట్ల మోడీ, షా తీవ్ర దిగ్భ్రాంతి.. ఏపీ కేబినెట్ సంతాపం
posted on: Jan 28, 2026 11:43AM

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి చెందడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే వారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు ఫోన్ చేసి ప్రమాద వివరాలను, తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాద వార్త తెలియగానే అజిత్ పవార్ కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరారు. సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సేవలు, భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మృతదేహాలను బారామతి మెడికల్ కాలేజీకి తరలించి, మృతుల గుర్తింపు ప్రక్రియ చేపట్టారు.
ఇలా ఉండగా విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ తీర్మానం చేసింది. బుధవారం (జనవరి 28) ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అజిత్ పవార్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అజిత్ పవార్ తో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయనీ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి తనను కలచివేసిందని అన్నారు. అజిత్ పవార్ మృతి మహారాష్ట్ర రాజకీయాలలో తీరని లోటని పేర్కొన్నారు. అనంతరం అజిత్ పవార్ మృతికి సంతాపం తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీర్మానం చేసింది.



.webp)
.webp)





