గిరిజనులంటే తెరాస ప్రభుత్వానికి చిన్నచూపు
posted on Oct 15, 2018 5:50PM
మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్ లేదా వేరే స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని భావించిన తెరాస ఎమ్మెల్సీ రాములు నాయక్ కు టికెట్ దక్కకపోగా,కాంగ్రెస్ పార్టీ నేతలతో భేటీ అయ్యారని ప్రచారం జరగటంతో అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ అధిష్ఠానం ప్రకటించింది.దీనిపై మీడియాతో మాట్లాడిన రాములు తెరాసలో ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం లేదని, అదో ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా తయారైపోయిందని ఆరోపించారు.ప్రగతి భవన్లో కేసీఆర్ వెంబడి ఉండే తెలంగాణ ద్రోహులు,ఆనాడు తెలంగాణ గురించి మాట్లాడని వాళ్లు కేబినెట్లో ఉన్నారని విమర్శించారు.తాను గిరిజనుడైనందు వల్లే కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండానే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని మండిపడ్డారు. గిరిజనులకు రిజర్వేషన్ కోరినందుకే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? అని నిలదీశారు.
గిరిజనులకు భూమి ఇస్తామన్నారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. దళితులకు కూడా భూమి ఇవ్వమంటే ఇవ్వట్లేదన్నారు. ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతామని ఉద్యమం సమయంలో కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారని, ఆ హామీ ఇప్పుడేమైందని ప్రశ్నించారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు.. తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.. అదేమైంది? మైదాన ప్రాంతంలో ఐటీడీఏలు పెట్టి అభివృద్ధి చేస్తామని చెప్పి ఏర్పాటు చేయలేదని దుయ్యబట్టారు. గిరిజన ఐఏఎస్లకు కీలక పదవులు కూడా ఇవ్వలేదన్నారు. గిరిజనులంటే తెరాస ప్రభుత్వానికి చిన్నచూపు ఉందన్నారు. డీఎస్సీ నిర్వహించమంటే పట్టించుకోలేదని, గిరిజన నిరుద్యోగులకు న్యాయం జరగలేదని చెప్పారు. డి. శ్రీనివాస్, కొండా సురేఖను సస్పెండ్ చేయాలని అందరూ కోరితే చేయలేదు గానీ.. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండానే తనను సస్పెండ్ చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాసకు గిరిజనులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బ్యాక్లాగ్ ఉద్యోగాలే కాదు పదో తరగతి పాసైన వేలాదిమందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఆయనదే అన్నారు.గిరిజన నాయకులు, మేధావులతో చర్చించాకే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టంచేశారు.ఒక దశలో ఆయన తీవ్ర ఉద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.