Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టీడీపీ యువనేతల్లో టిక్కెట్ల జోష్..
posted on: Mar 31, 2022 6:13PM
‘వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం టిక్కెట్లు పక్కా’ టీడీపీ ఆవిర్భవించి 40 వసంతాలు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు చేసిన ప్రకటనతో టీడీపీ యువతలో ఫుల్ జోష్ వచ్చింది. అతిరథ మహారథులు, పార్టీ ఆవిర్భావం నుంచీ సీనియర్ మోస్ట్ నేతలు ఉన్న టీడీపీలో తమకు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా? అని ఎదురు చూస్తున్న పార్టీ యువనేతల్లో అధినేత ప్రకటనతో హార్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు ప్రకటనతో ఇప్పటికైనా తమ కష్టం ఫలించి, చట్టసభల్లో అడుగుపెట్టేందుకు అవకాశం లభించబోతోందన్న ఆనందం వారిలో వెల్లివిరుస్తోంది.
నిజానికి ఈ 40 శాతం టిక్కెట్లు ఇస్తామనే సాంప్రదాయాన్ని టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత నందమూరి తారకరామారావు తీసుకొచ్చారు. ఆ సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించడం విశేషం. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు పలువురు యువ నేతలకు టీడీపీ టిక్కెట్తు ఇస్తూనే ఉన్నారు. అయితే.. ఇంత శాతం తప్పకుండా యువకులకే ఇస్తామనే రూల్ ఏదీ పెట్టలేదు. అయినప్పటికీ ఆయన యువతకు పెద్దపీటనే వేస్తూ వస్తున్నారు. తాజాగా 40 శాతం టిక్కెట్లు తప్పకుండా యువకులకే ఇస్తామని చంద్రబాబు ప్రకటించడంతో ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 40 శాతం చొప్పున దాదాపు 70 టిక్కెట్లు యువతకే కేటాయిస్తారన్నమాట. అలా 70 మంది యువ నేతలకు టిక్కెట్లు లభిస్తే.. టీడీపీ యువరక్తంతో మరింత చైతన్యవంతంగా ఉరకలెత్తుందనడంలో సందేహం ఉండదంటున్నారు.
ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్లు ఇచ్చేటప్పుడు యువతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సీనియర్ నేతలు కొందరు పార్టీ అధినేత చంద్రబాబుకు ఆంతరంగిక చర్చల సందర్భంగా సూచిస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ పార్టీలో ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు లాంటి సీనియర్లు కొందరు చంద్రబాబుతో జరిగిన, జరుగుతున్న అంతర్గత చర్చల్లో ఇదే విషయం సూచిస్తున్నారట. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండి, సేవలు అందించిన సీనియర్లలో కొందరికి ఇచ్చే టిక్కెట్లలో యువరక్తం నింపాలని వారు సలహా ఇస్తుండడం గమనార్హం. అలా యూత్ కు ప్రాధాన్యం ఇస్తే మరో నాలుగు దశాబ్దాల పాటు టీడీపీకి తిరుగే ఉండదనేది వారు చెబుతున్న మాట.
యువతకు ప్రాధాన్యం విషయంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ కూడా సుముఖంగా ఉన్నారంటున్నారు. ఆ క్రమంలోనే ఆయన ఇప్పటికే యువతను ఓన్ చేసుకునే పనిలో ఉన్నారు. గతంలో కంటే లోకేష్ రాజకీయ ప్రసంగాల్లో ఆరితేరారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. తన ప్రసంగాలతో యువతను బాగా ఆకట్టుకుంటున్నారు. వైసీపీ సర్కార్ చేసే ప్రతి తప్పుడు నిర్ణయాన్ని, అనాలోచిత చర్యనూ లోకేష్ తూర్పాపట్టి ఎండగడుతున్న తీరు యువతలో మంచి క్రేజ్ తీసుకొస్తోంది. పార్టీ ప్రకటించిన అన్ని కమిటీల్లోనూ యువతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. యువతను ఆకర్షించే విధంగా లోకేష్ నిర్వహించే కార్యక్రమాలు కూడా ఉంటున్నాయి.
అనాలోచిత నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ ను భ్రష్టు పట్టించిన జగన్ రెడ్డి సర్కార్ ను వచ్చే ఎన్నికల్లో మట్టికరిపించాలని ఓటర్లు ఇప్పటికే డిసైడ్ అయ్యారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏపీని ఆర్థికంగా దివాలా తీయించడమే కాకుండా.. వేల కోట్ల అప్పుల్లో ముంచేసిన వైసీపీ సర్కార్ ను నిట్టనిలువునా పాతరేయాలనే చర్చ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఇలాంటి సందర్భంలో రాష్ట్రానికి దశ, దిశ నిర్దేశం చేయగల దమ్మున్న పార్టీ టీడీపీయే అని, విడిపోయి అన్నివిధాలా అన్యాయమైపోయిన ఏపీలో అభివృద్ధిని పరుగులు పెట్టించగల సత్తా టీడీపీకి, చంద్రబాబుకే ఉన్నాయనే నమ్మకం జనంలో ఇప్పటికీ సజీవంగానే ఉందట. అందుకు అమరావతి రాజధాని నిర్మాణాన్ని పరుగులు పెట్టించిన చంద్రబాబు పనితీరును వారు మర్చిపోలేకపోతున్నారు.
ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే సమయం దూరంలో ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే యువతను అందుకు సిద్ధం చేసేలా, కార్యరంగంలో దూకేలా చంద్రబాబు నాయుడి ప్రకటన ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. చంద్రబాబు ప్రకటనతో భవిష్యత్తులో టీడీపీలో యువత ప్రధాన పాత్ర పోషించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయనేది పరిశీలకుల అభిప్రాయం.
అయితే.. టీడీపీలో టిక్కెట్లు ఇచ్చే విషయంలో యువతకు ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ సీనియర్ నేతలను చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టేయకపోవచ్చని అంటున్నారు. యువతకు తాను ప్రకటించిన కోటా ప్రకారం టిక్కెట్లు ఇచ్చినా.. సీనియర్ల ప్రాధాన్యత కూడా తగ్గకుండా చంద్రబాబు బ్యాలెన్స్ చేస్తారని అంటున్నారు. ఏదేమైనా చంద్రబాబు చేసిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ ప్రసంగం.. యువతలో మరింత చైతన్యాన్ని, జోష్ ను నింపిందని అంటున్నారు. ఇప్పటి నుంచి తమతమ నియోజకవర్గాల్లో వారు కార్యక్రమాలు నిర్వహించి, వారు నిత్యం ప్రజల్లో ఉండేలా చేస్తుందంటున్నారు. మొత్తం మీద వైసీపీ సర్కార్, ఆ పార్టీ నేతల ఆగడాలను అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు యువతతో చక్రం తిప్పే వ్యూహాన్ని తెరమీదకు తెచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


.webp)



