జగన్ పార్టీలోకి జోగి రమేష్
posted on Mar 28, 2013 2:16PM
కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా పెడన శాసనసభ్యుడు జోగి రమేష్ జగన్ పార్టీలోకి చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితి ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం సమంయలో జోగి రమేష్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన విషయం తెలిసిందే. ఆఖరు నిమిషం వరకు తాను ప్రభుత్వానికి అండగా ఉంటానని చెప్పిన జోగి రమేష్ చివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు లేచి నిలబడి కాంగ్రెసుకు షాక్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన తాను జగన్ పార్టీలోకి వెళ్తానని ప్రకటించారు.
ఈరోజు జోగి రమేష్ చంచల్ గూడ జైల్లో ఉన్న జగన్ ను ములాఖత్ సమయంలో కలిశారు. పెడన నుంచి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చేందుకు రమేష్ కు జగన్ హామీ ఇచ్చారని సమాచారం.