పాలనలో సమన్వయానికి మంత్రి లోకేష్ కొత్త ఒరవడి!
posted on: Feb 12, 2026 12:45PM

తనను తాను మెరుగుపరుచుకోవడానికీ, క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం విషయంలో మరింత వేగంగా స్పందించడానికి ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అందు కోసం ఆయన వినూత్న ప్రయత్నాలు చేస్తుంటారు. కొత్త సంప్రదాయానికీ శ్రీకారం చుడతారు. ఇప్పుడు కూడా ఆయన ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయనో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బడ్జెట్ సమావేశాలు కొనసాగినన్ని రోజులూ నారా లోకేష్ రోజుకొక పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి వారి కుటుంబ సభ్యులతో డిన్నిర్ మీటింగ్ లు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈ డిన్నర్ మీటింగ్ ల ద్వారా ప్రజాప్రతినిథులతో మరింత మమేకం కావడమే కాకుండా, వారి ద్వారా ఆయా నియోజకవర్గాలలోని ప్రజా సమస్యలను వారి నుంచి నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి మరింత వేగంగా కార్యాచరణ చేపట్టే అవకాశం ఉంటుంది.
అలాగే నేతల యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు వారి వారి నియోజకవర్గాల సమస్యలు, అభివృద్ధి అవసరాలపై చర్చించి పరిష్కార మార్గాలను కనుగొనడమే లక్ష్యంగా ఈ డిన్నర్ మీటింగ్ లు ఏర్పాటు చేస్తున్నట్లు లోకేష్ చెప్పారు. ఈ డిన్నర్ భేటీలు ఉండవల్లిలోని ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరుగుతాయి. ఈ భేటీలో ప్రజాప్రతినిధులతో మమేకమవుతూ పరిపాలనలో సమన్వయం పెంచేందుకు ఎంతగానో దోహదపడతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.






