శిశిర్‌, దివ్యేందుల‌పై దీదీ ఆగ్ర‌హం

posted on: Aug 8, 2022 10:32AM

తండ్రి మాట త‌న‌యుడు వింటాడు. తండ్రి బాట‌లోనే త‌న‌యుడు వెళ్లాల‌నుకోవ‌డంలోనూ త‌ప్పు లేదు. తండ్రి ఒక‌రికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌నుకున్న‌పుడు త‌న‌యుడు ప‌క్క‌నే ఉండి త‌నూ ఓకే అన‌కుండా ఎలా ఉం టాడు. అందులోనూ ఇద్ద‌రూ ఎంపీల‌యిన‌పుడు. ఈ తండ్రీ కొడుకుల స్వీయ నిర్ణ‌యం వారిద్ద‌రికి బావుం దేమోగాని వారిని ఎంపీలుగా చేసిన టీఎంసీ పార్టీ అధినేత‌కుమాత్రం స‌సెమిరా న‌చ్చ‌లేదంటే న‌చ్చ‌ లేదు. పార్టీలో ఉన్న‌పుడు పార్టీ నియ‌మాల‌కు క‌ట్టుబ‌డి ఉండాలి. పార్టీ అధినేత చెప్పిన మాటే శాస‌నం అవుతుంది. అదే వినాలి, అదే చేయాలి. లోక్‌సభలో తృణమూల్ పక్షనేత  శిశిర్ అధికారి, ఆయ‌న కుమారుడు దివ్యేందు అధికారి  కూడ‌బ‌లుక్కున్న‌ట్టుగా ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ఓటింగ్‌లో పాల్గొన్నారు. వాస్త‌వానికి వారికి వారి అధినేత మ‌మ‌తా బెన‌ర్జీ ఆదేశాలేమీ లేవు. కానీ వారు ధైర్యం చేశారు. ప‌శ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత మ‌మ‌తా బెన‌ర్జీకి కోపంవ‌చ్చింది. పార్టీ అధినేత‌తో సంప్ర‌దించ‌కుం డానే ఓటింగ్‌లో పాల్గొన్నార‌ని తెలిసింది. 

ఉపరాష్ట్రపతి ఎన్నికలతో తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేగింది. ఓటింగ్‌కు దూరంగా ఉండాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినా ఇద్దరు ఎంపీలు ఓటు వేయడంపై ఆ పార్టీ అధిష్టానం కన్నెర్ర చేసింది. పార్టీ ఎంపీలిద్ద‌రికీ   ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడంపై షోకాజ్ నోటీసులు జారీచేసింది. వివరణ ఇవ్వాలంటూ లోక్‌సభ లో తృణమూల్ పక్ష నేత సుదీప్ బంధో పాధ్యాయ  ఆ ఇద్దరు ఎంపీలకు లేఖలు రాశారు. పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా ఉన్న జగ్‌దీప్ ధనకర్‌ ను ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎన్డీయే ప్రకటించడంతో ఎన్నికలకు దూరంగా ఉండాలని తృణమూల్ ముందే నిర్ణయించింది. తద్వారా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తృణమూల్‌కు పార్లమెంట్‌లో మొత్తం 35 మంది ఎంపీలున్నా రు. ఇందులో 23 మంది లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

సుదీప్ బంధోపాధ్యాయ రాసిన లేఖలు అందుకున్న శిశిర్ అధికారి పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత సువేందు అధికారి తండ్రి. శిశిర్ అధికారి పశ్చిమబెంగాల్ కాంతి నియోజకవర్గం నుంచి మూడు సార్లు టీఎంసీ ఎంపీగా గెలుపొందారు. ఆయన మరో కుమారుడు దిబ్యేందు అధికారి 2019లో తమ్లుక్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. పశ్చిమబెంగాల్‌లో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సువేందు అధికారి బీజేపీ లో చేరినా వీరు తృణమూల్‌‌కు రాజీనామా చేయలేదు. టీఎంసీ లోనే కొనసాగుతున్నారు. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో శిశిర్  దిబ్యేందు లు  ఓటుహక్కు విని యోగిం చుకోవడం పార్టీ ఆదేశాలను ధిక్కరించడమేనని తృణమూల్ అధిష్టానం కన్నెర్ర చేసింది. 

కాగా వీరిపై లోక్‌సభ స్పీకర్‌కు ఇప్పటికే అనేకసార్లు ఫిర్యాదు చేసినా ఆధారాలు కావాలంటూ దాట వేశారని సుదీప్ బంధోపాధ్యాయ ఆరోపించారు. లోక్‌సభ స్పీకర్ వీరిపై చర్యలు తీసుకోకున్నా పార్టీ తరపున కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని తృణమూల్ వర్గాలు చెబుతున్నాయి.  ఈ నెల ఆరున జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధి జగదీప్‌ ధనకర్ 528 ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి, యూపిఏ అభ్యర్థి మార్గరెట్ అల్వాకు 182 ఓట్లు వచ్చాయి. ధనకర్‌కు 346 ఓట్ల ఆధిక్యం లభించింది

google-ad-img
    Related Sigment News
    • Loading...