‘మా’ ఎన్నికలపై మళ్ళీ కోర్టుకెక్కిన కళ్యాణ్

 

రాజకీయ ఎన్నికలకి ఏ మాత్రం తీసిపోని విధంగా జరిగిన తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో ఊహించని విధంగా రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దానితో ఇక వివాదాలన్నీ ముగిసినట్లేనని అందరూ భావించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుండి ఇంతవరకు ఇరు వర్గాలకు చెందినవారు ఎవరూ కూడా మళ్ళీ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోకుండా మళ్ళీ ఎవరి పనిలో వారు పడిపోవడంతో వివాదాలన్నీ ఇక సమసిపోయాయనే అందరూ అనుకొన్నారు. కానీ ఇంతకు ముందు ‘మా’ ఎన్నికలు సక్రమంగా నిర్వహించలేదనే పిర్యాదుతో కోర్టుకెక్కిన సినీ నటుడు ఓ. కళ్యాణ్, మళ్ళీ అదే పిర్యాదుతో మొన్న సిటీ సివిల్ కోర్టులో పిటిషను వేశారు. ఆయన వేసిన పిటిషన్ పై స్పందించిన కోర్టు కొత్తగా ఎన్నికైన మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మాజీ అధ్యక్షుడు మురళీ మోహన్, శివాజీ రాజాలకు నోటీసులు జారీ చేసింది. అంతా సర్దుమణిగిందనుకొంటునప్పుడు మళ్ళీ ఆయన కోర్టుకి ఎందుకు ఎక్కారో...ఆయనను వెనుక నుండి ఎవరు ప్రోత్సహిస్తున్నారో అని అందరికీ అనుమానాలు కలుగుతున్నాయి.